Fri May 03 2024 20:07:57 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ముత్యాలముగ్గులో రావుగోపాలరావులా మోదీ...పక్కన భజంత్రీలుగా వాళ్లిద్దరూ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీ, చంద్రబాబు, వైఎస్ జగన్ లపై సెటైర్ వేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీ, చంద్రబాబు, వైఎస్ జగన్ లపై సెటైర్ వేశారు. ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన సభలో మాట్లాడుతూ ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాలరావు క్యారెక్టర్ మోదీ అని, ఆయన పక్కన భజంత్రీలు వాయించే ఇద్దరూ జగన్, చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని, ఇక్కడ ఏ పార్టీ గెలిచినా మోదీకే జై కొడతారన్నారు. అందుకే మోదీని ప్రశ్నించాలంటే ఏపీలో కాంగ్రెస్ కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో కేంద్రాన్ని ప్రశ్నించే గొంతుకలు కరువయ్యాయని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
విడిపోయినా అందరం...
తెలంగాణ, ఏపీ విడిపోయినా తెలుగువారిగా అందరం ఒక్కటేనని, 32 మంది ప్రాణత్యాగాలతో సాధించిన విశాఖ ఉక్కును అదానీ కోసం ప్రధాని మోదీ ప్రయివేటు పరం చేస్తుంటే ఇక్కడ పహిల్వాన్లుగా చెప్పుకుంటున్న నేతలు ప్రశ్నించరెందుకని అన్నారు. ముగ్గురూ మోదీ దొడ్లో మనుషులేనని పవన్, జగన్, చంద్రబాబును ఉద్దేశంచి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఆరోగ్య శ్రీ వల్ల ఎందరో బతికి బయటపడగలిగారన్నారు. ఏపీలో మోదీ బలం, బలగం వారేనని, ఈసారి వారిని పక్కన పెట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ కు అవకాశమివ్వాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రశ్నించే అవకాశం దక్కుతుందని ఆయన తెలిపారు.
Next Story