Mon May 20 2024 01:11:41 GMT+0000 (Coordinated Universal Time)
Delhi Air Pollution :డీజిల్ వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశిస్తే.. రూ.20వేలు జరిమానా
బీఎస్ 3 పెట్రోల్, బీఎస్ 4 డీజిల్ వాహనాలకు మాత్రం ఢిల్లీలోకి ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. వాయుకాలుష్యం విపరీతంగా..
దేశరాజధాని ఢిల్లీలో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. తీవ్ర వాయుకాలుష్యంతో.. స్వచ్ఛమైన గాలి నాణ్యత శాతం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. దీంతో కాలుష్య నియంత్రణకు ఆప్ సర్కారు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఢిల్లీలోకి డీజిల్ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. అత్యవసర, నిత్యావసర వస్తువులను తరలించే వాహనాలు మినహా, మిగతా డీజిల్ వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై రూ.20 వేల వరకూ జరిమానా విధిస్తామని ఆ రాష్ట్ర రవాశాఖ ప్రకటించింది. ఈ ఆంక్షలు నుండి ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాల రాకపోకలకు సడలింపు ఇచ్చింది.
బీఎస్ 3 పెట్రోల్, బీఎస్ 4 డీజిల్ వాహనాలకు మాత్రం ఢిల్లీలోకి ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ సహకారంతో నడిచే బస్సులను పక్కన పెట్టి.. ప్రజా రవాణా కోసం 1000 సీఎన్ జీ బస్సులను అద్దెకు తీసుకోనున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ చెప్పారు. ఢిల్లీ చుట్టుపక్కల పంటపొలాల్లో రైతులు పంటల వ్యర్థాన్ని తగలబెట్టడంతో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో నేటి నుండి పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ఆప్ ప్రభుత్వం. వాయుకాలుష్య తీవ్రత కంట్రోల్ లోకి వచ్చేంత వరకూ ఆన్లైన్ తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ప్రజలు కూడా అనవసర ప్రయాణాలను మానుకోవాలని మంత్రి కైలాష్ విజ్ఞప్తి చేశారు.
Next Story