Budameru Vijayawada: ఆ మెసేజీతో అర్ధరాత్రి వణికిపోయిన విజయవాడ వాసులు.. నమ్మకండి!

మరోసారి బుడమేరు విధ్వంసం అవకాశం ఉందంటూ

Update: 2024-09-15 02:37 GMT

విజయవాడ నగరంపై బుడమేరు చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఎన్నో కాలనీలు వరద దెబ్బకు అల్లాడిపోయాయి. క్షణాల్లో ప్రజల బతుకులు తారుమారయ్యాయి. కొన్ని కుటుంబాలు కోలుకోడానికి కొన్ని సంవత్సరాలు సమయం పడుతుంది. అయితే మరోసారి బుడమేరు విధ్వంసం జరిపే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతూ ఉంది. ఇవన్నీ పుకార్లేనని ఎవరూ నమ్మకండని ప్రభుత్వం స్పష్టం చేసింది. బుడమేరుకు మళ్లీ గండ్లు పడ్డాయని, మళ్లీ వరద వస్తోందనే పుకార్లు నమ్మకండని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు. బుడమేరుకు ఎలాంటి వరద నీరు రాలేదని, బుడమేరుకు మళ్లీ వరద అంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని కలెక్టర్ సృజన వివరించారు. పుకార్లు వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బుడమేరుకు మళ్లీ వరద వస్తోందని, విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, తదితర ప్రాంతాలు మళ్లీ నీట మునుగుతాయని జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. కొత్త రాజేశ్వరిపేట, జక్కంపూడి కాలనీల్లో ఎలాంటి వరద నీరు రాలేదని వెల్లడించారు. బుడమేరు కట్ట మళ్లీ తెగిందనేది పూర్తిగా అవాస్తమని, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరంలేదన్నారు.

టెన్షన్ పెట్టిన సోషల్ మీడియా పోస్టులు
:

సోషల్ మీడియాలో పోస్టులను చూసి విజయవాడ వాసులు అర్ధరాత్రి వణికిపోయారు. అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక, రాజరాజేశ్వరిపేట, నందమూరి నగర్‌, తోటవారి వీధి, అంబాపురం, భరత మాత కాలనీ తదితర ప్రాంతాల వాసులు ఇళ్లనుంచి బయటకు వచ్చేసారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. సీఐ కృష్ణమోహన్‌ నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగి గండి పడలేదు, భయపడకండి అంటూ మైక్ లో వీధుల్లో ప్రచారం చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.


Tags:    

Similar News