వెకేషన్ బెంచ్ కు బదిలీ

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో ఉన్నారు.

Update: 2023-10-19 10:05 GMT

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. పిటిషన్ విచారణను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేయాలని హైకోర్టును చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. వారి విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి వెకేషన్ బెంచ్ కు విచారణను బదిలీ చేశారు. ఇక వచ్చే వాయిదా నాటికి చంద్రబాబు మెడికల్ రిపోర్టులను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులను ఆదేశించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో ఉన్నారు.

చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్‌ను జైలు అధికారులు రెండు నుంచి ఒకటికి కుదించారు. ఈ ములాఖత్‌లు పెంచాలని కోరుతూ టీడీపీ అధినేత న్యాయవాదులు ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. లీగల్ ములాఖత్‌లు రోజుకు మూడుసార్లు ఇవ్వాలని న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వివిధ పిటిషన్లపై చంద్రబాబుతో మాట్లాడటానికి తమకు అవకాశం ఇవ్వాలన్నారు. న్యాయపరమైన అంశాల మీద చర్చించేందుకు చంద్రబాబుతో కలిసేందుకు జైలు అధికారులు అంగీకరించడం లేదని తెలిపారు. ములాఖత్ ఇవ్వకుండా జైలు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు లాయర్ల లీగల్ ములాఖత్‌పై పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని న్యాయమూర్తి తెలిపారు.


Tags:    

Similar News