Rk Roja : ఆర్కే రోజా టార్గెట్ గా ఫిర్యాదు.. సీఐడీకి వంద కోట్ల అవినీతి అంటూ...?

మాజీ మంత్రి ఆర్కే రోజా పై తొలి ఫిర్యాదు సీఐడీకి అందింది. వంద కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ సీఐడీకి ఫిర్యాదు చేశారు

Update: 2024-06-14 04:10 GMT

మాజీ మంత్రి ఆర్కే రోజా పై తొలి ఫిర్యాదు సీఐడీకి అందింది. వంద కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ ఆర్కే రోజాపై సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆడుదాం ఆంధ్ర పేరిట వంద కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటు, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధరెడ్డిపై ఈ ఫిర్యాదును ఆత్యా - పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్ తెలిపారు. ఆర్కే రోజా, బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిలు ఈ ఆడుదాం కార్యక్రమంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు.

పూర్తి స్థాయి విచారణకు...
దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెల్లడవుతాయని సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన శాప్ ఎండీలు, ఇతర క్రీడాశాఖ అధికారులను కూడా విచారిస్తే వీరిద్దరి బాగోతం బయటపడుతుందని సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటాలో అనేక మందికి వైద్య, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీలలో ప్రవేశం పొందారని, వీటిపై కూడా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ సీఐడీకి ఫిర్యాదు చేశారు.
అనేక అవకతవకలు...
ఐదేళ్ల కాలంలో శాప్ అధికారులు అన్ని ఇంజినీరింగ్ పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారని, దీనిపై దర్యాప్తు చేయాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. అవకతవకలను పరిశీలించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆర్డీ ప్రసాద్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై తొలి ఫిర్యాదు సీఐడీకి ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్ధరెడ్డిపైనే వచ్చింది. దీనిని సీఐడీ అధికారులు సీరియస్ గా పరిశీలిస్తున్నారు. అవసరమైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐడీ అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News