Ys Jagan : జగన్ చేసిన తప్పులను పదే పదే చేస్తున్నారా? ఆయనను వదులుకోలేకపోతున్నారా?
వైసీపీ అధినేత జగన్ అధికారాన్ని కోల్పోయినా ఆయనలో మార్పు రాలేదని స్పష్టంగా తెలుస్తుంది;

వైసీపీ అధినేత జగన్ అధికారాన్ని కోల్పోయినా ఆయనలో మార్పు రాలేదని స్పష్టంగా తెలుస్తుంది. ఎంత మంది పార్టీ నేతలు వెళ్లింది కారణాలు ఎవరని చెప్పిందీ అందరికీ తెలుసు. అందరి వేళ్లూ చూపించిన వారినే అందలం ఎక్కించుకంటుంటే ఇక జగన్ వైఖరిలో ఏం మార్పు వచ్చినట్లు? సీట్ల కేటాయింపుల దగ్గర నుంచి ముఖ్యమైన నిర్ణయాల వరకూ.. ఐదేళ్లలో అన్ని శాఖలపై పెత్తనం వెలగబెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డికి మరోసారి జగన్ కీలక పదవి కట్టబెట్టడం పార్టీలోనే చర్చనీయాంశమైంది. సజ్జల రామకృష్ణారెడ్డిని పీఏసీ కన్వీనర్ గా నియమించడం జగన్ చేసిన అతి పెద్ద తప్పు అంటూ ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియాలో పెద్దయెత్తున పోస్టులు కనపడుతున్నాయి.
వివాదాలకు కేరాఫ్ గా...
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించిన తీరు వివాదాలకు నిలయంగా మారింది. నాటి ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తే అది రాజకీయ విమర్శలు అని సరిపెట్టుకోవచ్చు. కానీ పార్టీని వీడి వెళ్లిపోతున్న నేతలందరూ సజ్జల వైపు చూపుతున్నారు. చివరకు జగన్ కు కష్టకాలంలో అండగా ఉండి ఆయనతో పాటు జైలుకు వెళ్లి పదహారు నెలలు గడిపి వచ్చిన విజయసాయిరెడ్డి కూడా కోటరీ అంటూ పరోక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డి వైపు చూపారు. అంటే ఆయనపై పార్టీలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ నుంచి వెళ్లి పోయేవారు సజ్జల ను కార్నర్ చేస్తున్నారని జగన్ భావిస్తే అంతకంటే మించిన కామెడీ మరొకటి ఉండదు.
ఐదేళ్లలో అనేక పనుల్లో...
ఎందుకంటే జగన్ కు తెలియకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అనేక పనులు ఐదేళ్లలో చక్కపెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యమైన పదవుల నియామకం నుంచి పార్టీ ఇన్ ఛార్జుల మార్పు వరకూ అంతా సజ్జల చెప్పినట్లే జరిగిందంటారు. జగన్ వద్దకు కనీసం వెళ్లేందుకు కూడా సజ్జల అంగీకరించేవారు కాదు. అంతా తన వద్దనే సర్దుబాటు చేసి మంత్రులను, ఎమ్మెల్యేలను పంపేవారు. జగన్ తనకు చెప్పారంటూ నేతలకు చెబుతుండటంతో అది నిజమేనని నమ్మిన నేతలు మౌనంగానే వెనక్కు వెళ్లిపోయేవారు. అలాగే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు జగన్ దృష్టికి తీసుకెళ్లకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకున్నాన్న విమర్శలు కూడా ఫ్యాన్ పార్టీలో వినిపించాయి.
సజ్జల హవా...
అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి గత ఎనిమిది నెలలుగా కొంత దూరంగా ఉంటున్నారు. అయితే జగన్ కూడా ఆయనను దూరం పెట్టారులే అని అందరూ అనుకున్నారు. కానీ పీఏసీ కమిటీ కన్వీనర్ గా నియమించడంతో జగన్ వద్ద సజ్జల రామకృష్ణారెడ్డి హవా ఏమాత్రం తగ్గలేదన్నది మరోసారి స్పష్టమయింది. సజ్జల వల్ల పార్టీకి ప్రయోజనం లేకపోగా, నష్టమేనని అందరూ చెబుతున్నప్పటికీ జగన్ మాత్రం మొండిగా వ్యవహరించడం పట్ల వైసీపీ సీనియర్ నేతలు సయితం ఒకింత ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల కాలంలో ఉన్న పరిస్థితులు వైసీపీలో ఏం మారలేదనడానికి సజ్జల రామకృష్ణారెడ్డి నియామకమే నిదర్శనమని అంటున్నారు. మరి సజ్జల వల్ల ఉపయోగం జగన్ కు మాత్రమే తెలుసా? ఆయన వైఖరిలో మార్పు రాదన్నది ఈ నియామకంతో వెల్లడయింది.