Heavy Rains : వాయుగుండం ప్రభావం... దంచి కొడుతున్న వానలు

అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో అనేక జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు

Update: 2024-07-20 03:00 GMT

తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. వాగులు, నదులు పొంగి పొరలుతున్నాయి. అనేక జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు ఉధృతంగా పారుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాయుగుండం ప్రభావం తో  నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది

అల్పపీడనం...
బంగాళాఖాతంలో ఒడిశా,ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఏపీ విపత్తులు సంస్థ తెలిపింది. ఇది ఈరోజు తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటింది. ఆతరువాత క్రమంగా వాయుగుండం బలహీనపడనుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ జిల్లాల్లో...
కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది.


Tags:    

Similar News