Ys Vijayamma : విజయమ్మ పెదవి విప్పరేం? ఏంది తల్లీ ఈ రచ్చ? ఈ కష‌్టం పగవాళ్లకు కూడా వద్దు

వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఆస్తుల వివాదం రోడ్డున పడింది. తల్లి విజయమ్మ మాత్రం మౌనంగా ఉంది

Update: 2024-10-26 06:45 GMT

వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఆస్తుల వివాదం రచ్చ రచ్చగా మారింది. రోడ్డు మీదకు ఎక్కింది. రాజకీయంగా చర్చకు దారి తీసింది. కుటుంబాల గొడవ ఎందుకని జగన్ ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో కుటుంబం గొడవ కాదని, ఒక తల్లి, చెల్లికి జరిగిన అన్యాయం అంటూ అధికార పక్షం వాదిస్తుంది. ఇటు వైఎస్ షర్మిల రోజుకో లేఖలను విడుదల చేస్తున్నారు. జగన్ తరుపున మీడియా సమావేశాలు పెట్టి వైఎస్ షర్మిల పైన, చంద్రబాబుపైన వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. జగన్ ఓటమి పాలయి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఆస్తుల వివాదం నిజంగానే జగన్ కు తలనొప్పిగా మారింది.

ప్రేమానురాగాలు లేవని...
అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు లేవని స్పస్టంగా అర్థమయింది. ఈ విషయాన్ని జగన్ స్వయంగా కూడా చెప్పారు. రాజకీయంగా తనను వ్యతిరేకించడమే కాకుండా, వ్యక్తిగతంగా తనను, తన కుటుంబంపై విమర్శలు చేయడంతో ఆమెతో తెగదెంపులు చేసుకోవడానికే సిద్ధపడినట్లు కనిపిస్తుంది. పేగు బంధం, రక్త సంబంధం అంటూ ఇక సెంటిమెంట్ తో వేలాడే సూచనలు మాత్రం ఇద్దరి వద్ద కనిపించడం లేదు. వైఎస్ షర్మిల కూడా జగన్ కు దీటుగానే స్పందిస్తున్నారు. తాను ఏ విషయంలో తగ్గనని, తన వాటా తనకు కావాల్సిందేనంటూ.. ఒక ఆడపడుచుకు అన్యాయం చేస్తావా? అంటూ నిలదీయడానికి సిద్ధమయ్యారు.
విజయమ్మ మౌనం...
ఈ పరిస్థితుల్లో తల్లి విజయమ్మ మౌనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తల్లి విజయమ్మ ఎటు వైపు మొగ్గు చూపుతుందని రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. వైఎస్ కుటుంబ సభ్యులు కూడా విస్తుబోయి చూడటం మినహా ఈ వివాదంలో తలదూర్చే ప్రయత్నం చేయడం లేదు. వైఎస్ కు సోదరులు, చెల్లెళ్లు ఉన్నప్పటికీ వారంతా ఈ కాంట్రవర్సీలో కాలుమోపడం లేదు. మనకెందుకు వచ్చిన తంటా అని గమ్మున ఉన్నారు. ఇక తల్లి విజయమ్మ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. ఒకవైపు కన్న కొడుకు, మరొక వైపు గారాల కూతురు. ఇద్దరినీ వదులుకోలేరు. ఇద్దరితో బంధాన్ని తెంచుకోలేరు. తనకు సాయం చేసేవారు కూడా లేరు. అసహాయ స్థితిలో విజయమ్మ ఉన్నట్లే కనపడుతుంది.
మానసిక వేదన...
విజయమ్మ ఎటువైపు మొగ్గు చూపినా మరొకరు హర్ట్ అవుతారు. హర్ట్ అవ్వడమే కాదు దూరమవుతారన్న భయం ఆమెను వెంటాడుతుంది. కానీ ఇద్దరు మొండోళ్లు అని తెలుసు. తాను చెప్పినా వినరని ఆమెకు తెలియంది కాదు. అలాగని మౌనంగా ఉంటే ఈ రచ్చ ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు. దీంతో ఆమె లోటస్ పాండ్ లో ఉండి తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని తెలిసింది. ఎవరూ ఈ వివాదాన్ని పరిష్కరించలేని పరిస్థితుల్లో, తాను పెదవి విప్పలేని విషయం కావడంతో ఆమె బాధ వర్ణనాతీతం. ఏ కన్నతల్లికీ ఇలాంటి బాధ రాకూడదు. ఆమె బతికుండగానే రెండు గోడలు వెలిశాయి. అడ్డుగోడలు తొలిగిపోయేలా లేవు. కుమిలిపోతున్నారు. కుంగిపోతున్నారు. విజయమ్మను మాత్రం వైఎస్ జగన్ కానీ, షర్మిల కానీ దృష్టిలో ఉంచుకోకుండా తమ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. మధ్యలో నలిగిపోయేది తల్లి విజయమ్మ మాత్రమే. వైఎస్ అభిమానులు కూడా విజయమ్మ ఏదో ఒకటి చేసి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నారు.


Tags:    

Similar News