అత్తారింటి వాళ్లే ఆమెను చంపేశారన్నారు.. తీరా ఆ మహిళ ఎవరితో దొరికిపోయిందంటే!

మూడేళ్ల కిందట అత్తమామల ఇంటి నుంచి కనిపించకుండా పోయిన ఓ మహిళ

Update: 2024-10-08 14:57 GMT

మూడేళ్ల కిందట అత్తమామల ఇంటి నుంచి కనిపించకుండా పోయిన ఓ మహిళ చనిపోయినట్లు భావించారు. అయితే ఉత్తరప్రదేశ్ పోలీసులు ఓ షాకింగ్ విషయాన్ని కనుగొన్నారు. లక్నోలో ఆ మహిళ తన ప్రియుడితో కలిసి జీవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గోండాకు చెందిన కవిత (23) నవంబర్ 17, 2017న దాదువా బజార్‌లో నివాసముంటున్న వినయ్ కుమార్‌ను వివాహం చేసుకుంది. ఆమె మే 5, 2021న తన అత్తమామల ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. మహిళ కుటుంబం, ఆమె అత్తమామలు ఒకరిపై మరొకరు కేసులు నమోదు చేసి న్యాయపోరాటం చేసుకుంటూ ఉన్నారు. "అత్తమామలే తమ కుమార్తెను హత్య చేశారని కవిత కుటుంబసభ్యులు ఆరోపించారని, దీంతో ఆమె భర్త, బావ, అత్త, ఆడపడుచుపై కేసు నమోదు చేశాము" అని గోండా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) వినీత్ జైస్వాల్ అన్నారు.

ఎంత వెతికినా కూడా కవిత ఆచూకీ లభించలేదు. దీంతో 2022 డిసెంబర్‌లో కవిత సోదరుడు అఖిలేష్‌తో సహా ఆరుగురిపై కవిత భర్త వినయ్ కుమార్ కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ కేసు పెట్టారు. రెండు కేసులకు సంబంధించిన విచారణలు కొనసాగుతున్నాయి, అయితే కవిత ఆచూకీకి సంబంధించి ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ వ్యవహారం హైకోర్టుకు కూడా చేరింది. ఎట్టకేలకు పోలీసులు కవిత చనిపోలేదని గుర్తించారు. కవిత లక్నోలోని ఆమె ప్రియుడు సత్య నారాయణ్ గుప్తా ఇంట్లో ఉంది. లక్నోకు మకాం మార్చడానికి ముందు ఏడాది పాటు అయోధ్యలో తన ప్రియుడితో కలిసి జీవించినట్లు కవిత ఒప్పుకుంది.


Tags:    

Similar News