వెంకన్న దెబ్బతో వేటు పడిపోతుందా?

వైసీపీకి కావాల్సింది ఇపుడు ఒక్కటే. తమను ధిక్కరించి ప్రతిపక్షం కంటే దారుణంగా విమర్శలు చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇంటికి వెళ్లడం. ఆయన మీద అనర్హత [more]

Update: 2021-08-18 06:30 GMT

వైసీపీకి కావాల్సింది ఇపుడు ఒక్కటే. తమను ధిక్కరించి ప్రతిపక్షం కంటే దారుణంగా విమర్శలు చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇంటికి వెళ్లడం. ఆయన మీద అనర్హత వేటు పడాలని వైసీపీ మొత్తం కోరుకుంటోంది. దీని మీద స్పీకర్ ఓం బిర్లా ఏం చేయబోతున్నారు అన్నది తాజాగా వైసీపీ వర్గాలకు ఉప్పు అందినట్లుగా ఉంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నేరుగా ఢిల్లీ నుంచి తిరుపతికి వచ్చిన ఓం బిర్లాకు ప్రధాని స్థాయిలో స్వాగతం లభించింది. ఢిల్లీ వెళ్ళి ఆయన్ని కలవడం వేరు, ఆయనే తమ ప్రాంతానికి రావడం వేరు. దాంతో వైసీపీ ఎంపీలు మొత్తం స్పీకర్ చుట్టూ క్యూ కట్టేశారు.

సానుకూలమే …

ఇక వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి అయితే ఓం బిర్లా వెంటే ఉన్నారు. ఆయన మీద ఢిల్లీలో మీడియా ముఖంగా ఆ మధ్య ఘాటుగా మాట్లాడిన విజయసాయిరెడ్డి ఇపుడు మాత్రం తిరుపతి టూర్ లో స్పీకర్ పక్కన చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. అంతే కాదు ఆయనకు సకల మర్యాదలు లభించేలా దగ్గరుండి చూశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీలలో కీలక నేతలు అనదగిన వారు అంతా ఓం బిర్లాతోనే ఉన్నారు. ఇక ఓం బిర్లా కూడా వారితో చాలా సరదాగా మాట్లాడుతూ కనిపించారు. దాంతో వైసీపీ ఎంపీలకు ఓం బిర్లా మీద ఒక్కసారిగా ప్రేమ పొంగుకుని వచ్చింది.

వేటు ఖాయమే…?

స్వామి కార్యం, స్వకార్యం అంటారు. అలా ఓం బిర్లా తిరుపతి టూర్ కి వచ్చిన నేపధ్యంలో స్వకార్యం కోసమే వైసీపీ ఎంపీలు పెద్ద ఎత్తున వచ్చి ఆయన్ని కలిశారు అంటున్నారు. పైగా అధినాయకత్వం ఆదేశానుసారం రఘురామ రాజు పిటిషన్ మీద యాక్షన్ ఏంటో కూడా కనుగొనేందుకు కూడా ట్రై చేశారు. మొత్తానికి ఓం బిర్లా నుంచి వారికి సంకేతం ఏదో అందినట్లుగా ఉంది. అందుకే రెట్టించిన ఉత్సాహంతో రాజమండ్రీ ఎంపీ మార్గాని భరత్ మీడియా ముందుకు వచ్చి మరీ రాజు గారు ఇక ఇంటికే అనేశారు. ఆయన మీద వేటు త్వరలోనే పడుతుంది అని కూడా ధీమాగా చెప్పారు.

అదే జరిగితే…?

మొత్తానికి జగన్ కి బీజేపీ కి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది, దానికి సూత్రధారి కూడా రాజు అన్న మాట ప్రచారంలో ఉంది. ఏపీ సర్కార్ కోరినట్లుగా విభజన హామీల మీద చాలా విషయాలలో బీజేపీ స్పందించలేకపోవచ్చు. కానీ రాజు మీద వేటు వేయడానికి మాత్రం వారికి అభ్యంతరాలు అయితే పెద్దగా ఉండవని అంటున్నారు. అందుకే సూచనాప్రాయంగా వైసీపీ ఎంపీలకు ఈ విషయం స్పీకర్ ఓం బిర్లా ద్వారా తెలిసింది అంటున్నారు. రాజు కూడా తనకు స్పీకర్ ఆఫీస్ నుంచి వచ్చిన నోటీసులకు తగిన జవాబు ఇచ్చారు. ఇక స్పీక‌ర్ కోర్టులో ఈ వివాదం ఉంది. ఆయన కూడా వైసీపీ నేతలకు తిరుపతి టూర్ లో తీయని లడ్డూ లాంటి కబురే మోసుకుని వచ్చారు అంటున్నారు. దాంతో వైసీపీ ఎంపీల ముఖాలు బల్బుల్లా వెలిగాయట‌. నిజంగా రాజు మీద వేటు పడితే వైసీపీకి మరోసారి ఏపీలో బంపర్ మెజారిటీతో గెలిచినంత ఆనందం కలుగుతుందేమో చూడాలి.

Tags:    

Similar News