అకౌంట్ల లోకి 10వేలు.. 5 లక్షలతో ఇల్లు కూడా!

ఇటీవల వర్షం, వరదల కారణంగా ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్న కుటుంబాలకు

Update: 2024-09-15 04:35 GMT

ఇటీవల వర్షం, వరదల కారణంగా ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్న కుటుంబాలకు సెప్టెంబర్‌ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల చొప్పున అందజేస్తామని దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. వరద ప్రభావిత జిల్లాల నుంచి ఏ మేరకు నష్టం వాటిల్లిందనే దానిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్న వారికి రూ.16,500 ఇస్తున్నామని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు అందజేస్తామని చెప్పారు. వర్షాలు, వరదలతో పంట నష్టపోయినవారికి సాయం త్వరలోనే బ్యాంకు ఖాతాల్లో జమవుతుందని చెప్పారు. మెుత్తం 29 జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా గుర్తించారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీగా నష్టం వాటిల్లింది. మెుత్తం 33 మంది ప్రాణాలు కోల్పోయారు.

నాలుగు రోజుల్లో కాల్వల మరమ్మతులు పూర్తి చేసి రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు పొంగులేటి. వరదల కారణంగా అనేక కాల్వలు, ఇరిగేషన్ ట్యాంకుల గట్లు తెగిపోయాయన్నారు. నీటిపారుదల శాఖ యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టిందని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో రూ.10,300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని ఆర్థిక సాయం కోరిందని తెలిపారు. రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రుల సహాయం కూడా తీసుకుంటామన్నారు.


Tags:    

Similar News