Sun Mar 02 2025 22:12:25 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీలో మారుతున్న స్థానాలు...వైవీ చుట్టూ నేతల ప్రదిక్షిణలు
వైసీపీలో నెంబరు టూ అనుకునే వారంతా వరసగా వెళ్లిపోతున్నారు. దీంతో వైవీసుబ్బారెడ్డికి ప్రయారిటీ పెరుగుతోంది.

వైసీపీలో నెంబరు టూ అనుకునే వారంతా వరసగా వెళ్లిపోతున్నారు. జగన్ పార్టీని వీడి సీనియర్ నేతలు వెళ్లిపోతుండటంతో ఇక నెంబరు 2 స్థానం ఎవరిదన్న దానపై ఆసక్తికరమైన చర్చ మొదలయింది. మొన్నటి వరకూ విజయసాయిరెడ్డి వైసీపీలో నెంబరు టూ గా వ్యవహరించారు. ఆయనను కొద్దికాలం క్రితం జగన్ ఉత్తరాంధ్రకు ఇన్ ఛార్జిగా కూడా నియమించారు. అయితే ఆయన రాజీనామా చేసి వెళ్లిపోవడంతో ఇప్పుడు జగన్ ఎవరి మీద ఎక్కువ ఆధారపడతారన్న దానిపై చర్చ జరుగుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నప్పటికీ ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారు. అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఆయన ప్రభుత్వ సలహాదారుగానే పనిచేశారు.
సజ్జల ఉన్నప్పటికీ...
జగన్ చెప్పిన పనిని చేయడమే సజ్జల రామకృష్ణారెడ్డి చేసేవారు. జగన్ ఆదేశాలను అమలు చేసేంత వరకే సజ్జల పని. అంతకు మించి జగన్ వద్ద ఫ్రీగా మాట్లాడేందుకు కూడా ఆయనకు అవకాశం లేదన్నది అందరికీ తెలిసిందే. 2024 ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కొంత ఇబ్బంది పడుతున్నారు. ఆయనపై వరసగా కేసులు కూడా నమోదయ్యాయి. సకల శాఖ మంత్రిగా ఆయన నాడు పేరు పొందడంతో ప్రస్తుత అధికార పార్టీకి లక్ష్యంగా మారడంతో ఆయన కొంత దూరంగా ఉంటూ వస్తున్నారు. రేపు ఎన్నికల సమయం వరకూ సజ్జల రామకృష్ణారెడ్డి యాక్టివ్ అయ్యే అవకాశాలు ఎంత మాత్రం లేవన్నది స్పష్టంగా తెలుస్తోంది.
బాలినేని జనసేనలోకి...
ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి సయితం వైసీపీని వదిలి జనసేన పార్టీలోకి వెళ్లిపోయారు. జగన్ కు దగ్గర బంధువు కావడంతో ఆయనకు కొంత ఫ్రీ హ్యాండ్ ఉండేది. ప్రకాశం జిల్లాలో ఆయన చెప్పిన వారికే 2014 నుంచి 2024 వరకూ జరిగిన ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో జగన్ టిక్కెట్ ఇచ్చారంటారు. ఆయన సిఫార్సుకు అంత వాల్యూ జగన్ ఇచ్చేవారు. అదే సమయంలో జగన్ కు బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లాలో చేయి పెట్టడానికి వీలయ్యేది కాదు. ఎందుంకటే బాలినేని, వైవీ సుబ్బారెడ్డికి మధ్య పొసగేది కాదు. అందుకే జగన్ వైవీ సుబ్బారెడ్డికి రెండుసార్లు టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చి ఆధ్మాత్మిక కార్యక్రమాలకే పరిమతం చేశారంటారు.
ఇద్దరూ పార్టీని వీడటంతో...
ఇక ఇప్పుడు విజయసాయిరెడ్డి పార్టీలో లేరు. బాలినిని జనసేనలో ఉన్నారు. ఇక అంతా వైవీ సుబ్బారెడ్డిదే అన్న టాక్ నడుస్తుంది. జగన్ వద్ద స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పేందుకు వైవీ సుబ్బారెడ్డికి మాత్రమే అవకాశం ఉండటంతో ఆయనకు ఇక పార్టీలో ప్రయారిటీ పెరుగుతుందంటున్నార. పైగా జగన్ ఆయనకు రాజ్యసభ పదవి కూడా ఇవ్వడంతో ఢిల్లీలో కూడా లాబీయింగ్ చేయడానికి కీలకంగా మారనున్నారు. అందుకే ఇప్పుడు వైసీపీలో వైవీ హవా నడుస్తుందన్న వాదన బలంగా పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. వైవీ సుబ్బారెడ్డి అన్నింటా జగన్ కు అండగా ఉండటంతో ఆయనకే ప్రయారిటీ లభిస్తుందని భావించి ఎక్కువ మంది నేతలు ఆయన చుట్టూ చేరుతున్నారట.
Next Story