Wed Apr 23 2025 06:12:53 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షాపై విమర్శలకు దిగిన వైఎస్ షర్మిల
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి వచ్చిన అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందన్నారు. వైసీపీ పాలన ఓ విపత్తు అయితే.. 5 ఏళ్లలో విధ్వంసం జరుగుతుంటే ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా ? అని ప్రశ్నించారు. ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉన్నది మీరే కదా ? రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా అడిగారా ? - రాజధాని లేని రాష్ట్రంగా ఐదేళ్లు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా ? ఇష్టారాజ్యంగా 10 లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా ? అని నిలదీశారు.
వెనకేసుకొచ్చింది మీరు కాదా?
సొంత బాబాయి హత్యకేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే.. కేంద్ర హోం శాఖ మంత్రిగా మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయటపెట్టారా ? ఐదేళ్ల పాటు జగన్ మీకు దత్తపుత్రుడుగా కనిపించారని, ఆడించినట్లు ఆడే తోలుబొమ్మగా వ్యవహరించారని, పార్లమెంట్లో మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంప్ అని వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో సహజ వనరులను 'మోదానీ'కి దోచిపెట్టే ఏజెంట్ అని షర్మిల అన్నారు. ఇష్టారాజ్యంగా ఐదేళ్లు వైసీపీనీ వాడుకొని, రాష్ట్ర సంపదను దోచుకొని, ఇప్పుడు విధ్వంసం జరిగిందని ముసలి కన్నీరు కార్చితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారని షర్మిల అన్నారు.
Next Story