Mon Sep 16 2024 19:23:22 GMT+0000 (Coordinated Universal Time)
ఆ యువకుడి కుటుంబానికి 5 లక్షల సాయం: సీఎం చంద్రబాబు
ఆదివారం పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు గల్లంతు
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి లంక వద్ద గోదావరి నదిలో ఆదివారం పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు గల్లంతు అయ్యారు. ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. వరద ప్రభావిత లంక గ్రామాలకు వాటర్ ప్యాకెట్లు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆరుగురు పడవలో ఉండగా వరద ప్రవాహానికి పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఐదుగురు లైఫ్ జాకెట్లు ధరించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. వారిని స్థానిక మత్స్యకారులు రక్షించారు.
ఊడిమూడికి చెందిన విజయ్ కుమార్ (26) అనే యువకుడు నదిలో గల్లంతయ్యాడు. అతని కోసం పోలీస్, రెవెన్యూ, అధికారులు గాలింపు చేపట్టారు. విజయ్ స్వస్థలం పి.గన్నవరం గ్రామం. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గోదావరిలో గల్లంతైన యువకుడి కుటుంబానికి రూ.5 లక్షల సాయం ప్రకటించారు. గోదావరి నదిలో వరద ఉద్ధృతి తగ్గేంతవరకు లంక గ్రామాల ప్రజలు, గోదావరి పరీవాహక ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Next Story