Sun Dec 14 2025 18:05:29 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : పింఛను అనర్హుల గుర్తింపునకు మార్గదర్శకాలివేనట
ఆంధ్రప్రదేశ్లో అనేకులు అనర్హులు కూడా పింఛను పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఏరివేతకు మార్గదర్శకాలను రూపొందిచింది

ఆంధ్రప్రదేశ్లో అనేక మంది అనర్హులు కూడా పింఛను పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే ఎన్టీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛనును నాలుగు వేల రూపాయలకు పెంచింది. వృద్ధులు, వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు, దీర్ఘకాలిక రోగులకు పది వేల రూపాయల పింఛనును ప్రతి నెల మొదటి తేదీన ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛను పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల ఒకటో తేదీన చెల్లించాలని అధికారులను ఆదేశించడంతో అప్పటి నుంచి అదే తరహాలో పంపిణీ జరుగుతుంి. దాదాపు 69 లక్షల మందికి పైగానే వృద్ధులు, వితంతువులు పింఛనును ప్రతి నెల అందుకుంటున్న నేపథ్యంలో అనర్హులు కూడా అనేక మందికి పింఛను అందుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయింది.
గత ప్రభుత్వంలో...
గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను దిద్దేందుకు ప్రయత్నాలను ప్రారంభించడానికి సిద్ధమయింది. పింఛను అర్హులైన వారికే మంజూరు చేయాలని, తద్వారా ప్రభుత్వ సొమ్మును ఆదా చేయాలని సర్కార్ భావిస్తుంది. అనర్హులకు పింఛను ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని భావించి పింఛను లబ్దిదారుల అనర్హుల ఏరివేతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మేరకు అధికారులు ఏపీలో కసరత్తులు ప్రారంభించారు. పింఛన్ల తనిఖీ కోసం ప్రత్యేక యాప్ ను ఉపయోగించనున్నారు. రవాణా శాఖ, కేంద్ర సర్వీసులకు సంబంధించిన వివిధ శాఖల నుంచి అవసరమైన డేటాను తెప్పించుకుని పరిశీలిస్తారు. అనర్హులు ఎవరు? అర్హులు ఎవరనేది త్వరలోనే జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో బహిరంగంగా ఉంచుతారు. అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే గ్రామ సభలు నిర్వహించినప్పుడు అనర్హులుగా గుర్తించిన వారు తిరిగి దరఖాస్తు చేసుకునే వీలుంది. అనర్హులకు నోటీసులు కూడా పంపనున్నారు. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత మరోసారి అర్హుల పూర్తి జాబితాను ప్రకటించనున్నారని తెలిసింది. మొత్తం మీద ఏపీలో పింఛను లబ్దిదారుల అనర్హుల ఏరివేత ప్రారంభమయింది.
Next Story

