Sun Mar 23 2025 01:10:59 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీకి రెండురోజులు భారీ వర్షసూచన
బుధవారం.. మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు..

కొద్దిరోజులుగా మండుటెండలతో అల్లాడుతున్న ఏపీ ప్రజల ఎండకష్టాలు తీరనున్నాయి. ఇప్పటికే రాయలసీమంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. క్రమంగా ఏపీ మొత్తం వ్యాపిస్తున్నాయి. నైరుతి ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలిపారు.
బుధవారం.. మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే విజయనగరం, విశాఖ, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, సత్యసాయి, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణను నేడు లేదా రేపు నైరుతి రుతుపవనాలు తాకుతాయని ఐఎండీ తెెలిపింది. దక్షిణ తెలంగాణలోకి రుతుపవనాలు ఎంటరైతే.. నల్గొండ, గద్వాల, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లోకి మరింత విస్తరించనున్నాయి. వీటి ప్రభావంతో గురువారం నుంచి 3 రోజులపాటు తెలంగాణలో తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. జూన్ 26 నాటికి రాష్ట్రరమంతటా రుతుపవనాలు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు అంచనా వేశారు. అప్పటి వరకూ తెలంగాణలో ఎండల తీవ్రత ఉంటుందన్నారు.
Next Story