Thu Apr 10 2025 13:54:36 GMT+0000 (Coordinated Universal Time)
కిరణ్ రాయల్.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి!!
కిరణ్ రాయల్.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా

తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని, రూ.1.20 కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టాడని లక్ష్మి అనే మహిళ ఆరోపించింది. తీసుకున్న డబ్బు తిరిగివ్వాలని కోరితే తన పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆ మహిళ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. కిరణ్ రాయల్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ హైకమాండ్ స్పందించింది. ఆరోపణలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకునేంత వరకు తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి కిరణ్ రాయల్ ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించినట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు జనసేన వ్యవహారాల్లో కిరణ్ రాయల్ జోక్యం చేసుకోరాదని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించి, సమాజానికి ఉపయోగపడని వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాలని జనసైనికులకు, వీరమహిళలకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఈ పరిణామాలపై కిరణ్ రాయల్ పోలీసులను ఆశ్రయించారు. తన ఫోన్ డేటాను తస్కరించి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని తిరుపతి అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు బెదిరింపులతో తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, వైసీపీ సోషల్ మీడియా ఖాతాలతో దుష్ప్రచారం చేస్తున్నారని పోలీసులకు తెలియజేశానని కిరణ్ రాయల్ తెలిపారు. ఎప్పుడో పదేళ్ల కిందట సమసిపోయిన వ్యవహారాన్ని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారని, దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story