Mon Dec 15 2025 04:03:54 GMT+0000 (Coordinated Universal Time)
పందెం రాయుళ్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఆఫర్లు.. ఎక్కడా వినుండరు
నిర్వాహకుల మధ్య పోటీ తీవ్రతరమైంది. దాంతో పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు కౌతవరం, వేమవరం

సంక్రాంతి అనగానే.. ప్రతిఒక్కరికీ గుర్తొచ్చేవి భోగి మంటలు, రంగు రంగుల రంగవల్లులు, పిండి వంటలు, గాలిపటాలు.. ముఖ్యంగా కోడిపందేలు. ఇవి లేకపోతే.. సంక్రాంతి జరుపుకున్నట్టే ఉండదు. అయితే.. ఇప్పుడు కోడిపందేల్లోనూ..ఈ కామర్స్ మాదిరి ఆఫర్లు పెడుతుండటం విశేషం. మరీ ముఖ్యంగా ఏపీలో ఏర్పాటు చేసిన బరుల వద్ద పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఏడాది ఊహించని ఆఫర్లు పెట్టారు బరుల నిర్వాహకులు. ఇందుకు ప్రధాన కారణం.. నిర్వాహకుల మధ్య పోటీ విపరీతంగా ఉండటమే.
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలంలో రెండేళ్లుగా 6 బరులు ఏర్పాటు చేసి.. కోడి పందేలు నిర్వహిస్తున్నారు. వాటిలో మూడు పెద్దబరులు కావడంతో.. నిర్వాహకుల మధ్య పోటీ తీవ్రతరమైంది. దాంతో పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు కౌతవరం, వేమవరం బరుల నిర్వాహకులు సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చారు. రూ.2 లక్షల విలువైన కోడిపందేలను వరుసగా ఐదుసార్లు ఆడితే రూ. 1.75 లక్షల విలువైన బుల్లెట్ బండిని, లక్ష విలువైన పందేలు వరుసగా ఐదుసార్లు ఆడితే స్కూటీని బహుమతులుగా అందించనున్నట్టు ప్రకటించారు. ఈ బహుమతులను బరుల వద్దే.. ప్రధాన ఆకర్షణగా ఉంచారు. బహుమతుల సంగతి దేవుడెరుగు కానీ.. పందేల్లో లక్షలకు లక్షలు పోగొట్టుకోకుండా ఉంటే అంతే చాలనుకుంటూ.. బరిలోకి దిగుతున్నారు పందెం రాయుళ్లు.
Next Story

