Wed Apr 02 2025 21:36:14 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో బారులు తీరిన భక్తులు.. దర్శనానికి ఎంత సమయం అంటే?
తిరుమలలో భక్తులు రద్దీ పెరిగింది. ఉగాది పండగతో పాటు ఆదివారం కూడా కలసిరావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు

తిరుమలలో భక్తులు రద్దీ మళ్లీ పెరిగింది. ఉగాది పండగ కావడంతో పాటు ఆదివారం కూడా కలసిరావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి సమయం పడుతుంది. భక్తులు బారులు తీరి కనిపిస్తున్నారు. మాడవీధులన్నీ గోవింద నామ స్మరణలతో మారు మోగిపోతున్నాయి. ఎక్కడ చూసినా భక్తుల సందడితో ఉగాది రోజున తిరుమల కళకళలాడిపోతుంది. ఉగాది రోజును ఏడుకొండల వాడిని దర్శించుకుంటే మంచిదని భావించి స్థానికుల నుంచి ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా తిరుమలకు చేరుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ముందుగానే అంచనా వేసి...
ముందుగా మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు ఎస్.ఎస్.డి టోకెన్లు జారీ చేస్తుండటంతో వాటిని పొందిన భక్తులు, కాలినడకన వచ్చే భక్తులు ఇలా అన్ని రకాలుగా భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉగాది రోజున ప్రతి ఏడాది భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, దానిని ముందుగానే అంచనా వేసి తగిన చర్యలు తీసుకున్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. భక్తులు కంపార్ట్ మెంట్లలో ఇబ్బందులు పడకుండా వారికి అవసరమైన తాగునీరు. మజ్జిగ, అన్నప్రసాదాలను కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
31 కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు తీసుకున్న వారికి శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 76,005 మంది దర్శించుకున్నారు. వీరిలో22,686 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం3.80 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story