విస్సా కోడేరు గ్రామం ఆదర్శం: పవన్ కల్యాణ్ ప్రశంసలు
పశ్చిమ గోదావరి జిల్లా విస్సా కోడేరు గ్రామం స్వరాజ్యం సాధనలో ముందంజలో ఉందని, స్థానిక పాలనకు ఉదాహరణగా నిలిచిందని పవన్ పేర్కొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్థానిక సంస్థల ప్రాముఖ్యతను వివరించారు. కేంద్రం విడుదల చేసిన నిధులను పంచాయతీలకు కేటాయించకుండా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దారి మళ్లించిందని విమర్శించారు. గ్రామస్థాయి సమస్యలను స్థానిక సంస్థలే పరిష్కరించడం స్థానిక స్వయం పరిపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో పంచాయతీ నిధులను దుర్వినియోగం చేయడం ద్వారా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు, దీని వల్ల గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుందని, పంచాయతీలకు ఆర్థిక స్వాతంత్ర్యం, నిర్ణయాధికారం కల్పించిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు నిధులు విడుదల చేసిందని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆ నిధులను సద్వినియోగం చేసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా విస్సా కోడేరు గ్రామం ఇప్పుడు ఆదర్శంగా నిలిచిందని ఆయన ప్రశంసించారు.
15వ ఆర్థిక సంఘం ద్వారా విడుదలైన రూ.10 లక్షలతో తాగునీటి సమస్యను గ్రామ పంచాయతీ పరిష్కరించిందని పవన్ తెలిపారు. ఆర్థిక సంఘం నిధులతో రెండు ఫిల్టర్ బెడ్లు, నిరుపయోగంగా ఉన్న నీటిశుద్ధి కేంద్రాన్ని గ్రామస్థులే మరమ్మతు చేసుకున్నారని, అలాగే నూతన పైప్లైన్లు వేయడం ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించారని ఆయన ప్రశంసించారు. గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేసిన విస్సా కోడేరు పంచాయతీని, గ్రామ ప్రజలందరినీ పవన్ కల్యాణ్ అభినందించారు. ఈ అభివృద్ధి పనులను పర్యవేక్షించిన జిల్లా పంచాయతీ రాజ్, నీటి సరఫరా శాఖ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.