Tue Apr 08 2025 15:46:03 GMT+0000 (Coordinated Universal Time)
ఐఏఎస్ అధికారులు డిప్యూటేషన్ పై ఎందుకట? ఉన్నోళ్లు చాలరా?
రాష్ట్రంలో అధికారం మారినప్పుడల్లా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్ పై వస్తుంటారు

అధికారం మారినప్పుడల్లా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్ పై వస్తుంటారు. అప్పటి వరకూ కేంద్ర పరిధిలో పనిచేస్తున్నఅనేకమంది ఐఏఎస్, ఐపీఎస్ ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే ఇటువైపు వచ్చేందుకు ఉత్సాహం చూపుతారు. కేవలం రాజకీయంగా అనుకూలమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఉపయోగపడతారని అధికారంలో ఉన్నపార్టీలు భావించి వారి రాకకు రెడ్ కార్పెట్ వేస్తాయి. అలాగే తమకు కీలకపదవులు రాష్ట్రంలో లభిస్తాయని ఐఏఎస్, ఐపీఎస్ లు భావించి ఢిల్లీ నుంచి అమరావతి వైపునకు పరుగులు తీస్తారు. కేవలం జేబుకు పార్టీ బ్రాడ్జి ఉండదనే కాని. పక్కాగా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడానికే వీరు హస్తిన నుంచి ఇక్కడకు వస్తుంటారు.
ఎవరి హయాంలోనైనా...
అది జగన్ హయాంలోనైనా కావచ్చు. లేకుంటే చంద్రబాబు పరిపాలనలో కావచ్చు. ఎవరికి అనుకూలమైన ఐఏఎస్, ఐపీఎస్ లు వారుంటారు. సివిల్స్ రాసి మంచి ర్యాంకు సాధించిన వారు సయితం రాజకీయాల్లో పడి పార్టీలుగా విడిపోవడం కూడా కనిపిస్తుంది. తమకు ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నిశ్శబ్దంగా కేంద్రసర్వీసులకు వెళ్లి కాలం గడుపుతారు. ఇలా ఎందుకు జరగుతుందన్నది పక్కన పెడితే ఒకప్పడు ఐఏఎస్ అధికారులకు,నేడు ఉన్నకొందరు అధికారులకు మధ్య అసలు పొంతన ఉండదు. కేవలం రాజకీయ ప్రాపకం కోసమే వారు ఎక్కువగా పాటుపడుతుంటారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తమ మేధకుపదును పెట్టాల్సిన వారు పార్టీని తిరిగి అధికారంలోకి తేవడమెలా? అన్న దానిపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారన్నవిమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
చాలా మంది ఐఏఎస్ లు వచ్చినా...
రాష్ట్ర విభజన జరిగినప్పుడు క్యాడర్ విభజనలో ఆంధ్ర ప్రదేశ్ కు ఐఏఎస్, ఐపీఎస్ ల కేటాయింపులో కొంత అన్యాయం జరిగింది. అది అందరూ ఒప్పుకునేదే.కానీ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటుతున్నా ఇటీవల కాలంలో చాలా మంది ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ఏపీలో ఐఏఎస్ ల కొరత లేనేలేదన్నది కొందరి వాదన. గతంలో ముఖ్యమైన శాఖలతో పాటు వాటి అనుబంధ శాఖలను కూడా ఒకరే చూసేవారు. అప్పుడు సమన్వయం ఉండేది. కానీ ఇప్పుడు అధికారులు ఎక్కువ కావడంతో శాఖలను విడగొట్టి మరీ వారికి అప్పగిస్తున్నారు. దీనికి తోడు జిల్లాల సంఖ్యకూడా పెరగడంతో కలెక్టర్లుగా మారారు. ఒకరే ఒక శాఖతో పాటు దాని అనుబంధ శాఖలను పర్యవేక్షిస్తున్నప్పుడు సమర్ధవంతంగా నిర్ణయాలుండేవి. కానీ అధికారులు ఎక్కువ కావడంతో ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారన్నది అర్థం కాకుండా పోయింది. సమన్వనయం చేసే ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవడం లేదు.
సీఎంవో లో కూడా...
ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒకప్పుడు ఒక అధికారి ఉండేవారు. ముఖ్యమంత్రికి సహాయకారిగా ఉంటూ అన్ని శాఖలను సమన్వయంచేసుకుంటూ సీఎం ఆదేశాలను కిందకు చేరవేసేవారు. కానీ ఇప్పడు మాత్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి నలుగురైదుగురు ఐఏఎస్ లు ఉంటున్నారు. వారిలో కూడా పనిని పంచుకుంటూ కిందిస్థాయి అధికారులపై పెత్తనం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంవోలో ఉన్న ధనుంజయ్ రెడ్డి అంతా చక్రం తిప్పేవారు. చివరకు మంత్రులు జగన్ ను కలవాలన్నా ఆయన అనుమతి తీసుకోవాల్సి రావడం నిజంగా దురదృష్టకరమే. దీనికి తోడు ఉన్న అధికారులు చాలరన్నట్లు డిప్యూటేషన్ పై తెచ్చిపెట్టుకుంటున్నారు. వీరివల్ల ప్రయోజనం తాత్కాలికమే. రాష్ట్ర ప్రయోజనాలపై వీరికి పెద్దగా అవసరం ఉండదు. అలాగే అవగాహనకూడా తక్కువే. అస్మదీయులను తెచ్చిపెట్టుకుని పాలన చేస్తున్నందున ఐఏఎస్ లు ప్రభుత్వాలకు గుదిబండలుగా మారారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Next Story