మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీ లిక్కర్ స్కాం వ్యవహారంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఏపీ సీఐడీని ధర్మాసనం ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హాయాంలో మద్యం అమ్మకాలలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో పలువురిని నిందితులుగా చేర్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డిని ఇంకా నిందితుడిగా చేర్చలేదు. తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే భావనలో ఉన్న మిథున్ రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే బెయిల్ ఎలా ఇవ్వగలమని హైకోర్టు తెలిపింది. దీంతో, మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను ఈరోజు విచారించిన సుప్రీంకోర్టు తాము ఉత్తర్వులు ఇచ్చేంత వరకు అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది.