Tax Notice: ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఈ నోటీసు అందిందా? నో టెన్షన్..క్లారిటీ ఇచ్చిన ఐటీ శాఖ
2023 సంవత్సరం ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాము. ఈ ఏడాది సవరించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ను..

2023 సంవత్సరం ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాము. ఈ ఏడాది సవరించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ను దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31. ఇదిలా ఉండగా పన్ను చెల్లింపుదారులకు పన్నుల శాఖ నుంచి పన్నుకు సంబంధించిన సందేశాలు అందుతున్నాయి. ఇందులో ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేకంగా ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక విలువైన లావాదేవీలు జరుపుతున్న పన్ను చెల్లింపుదారులపై ప్రత్యేక నిఘా పెడుతోంది. ఇలాంటి పరిస్థితిలో మీకు కూడా ఏవైనా ఇలాంటి సందేశాలు వస్తే టెన్షన్ పడకండని అధికారులు చెబుతున్నమాట.
అధిక విలువ కలిగిన లావాదేవీలకు సంబంధించి పన్నుల శాఖ మెసేజ్లు పంపుతున్నట్లు తెలిసింది. అయితే ఆదాయపు పన్ను శాఖ నోటీసులను SMS ద్వారా పంపుతోంది. 2022-2023 మధ్య కాలంలో అధిక విలువ కలిగిన లావాదేవీలపై నోటీసులు చేరవేరుస్తోంది ఐటీ శాఖ. అయితే సవరించిన ఐటీఆర్ను డిసెంబర్ 31లోగా నింపాలని ప్రజలను కోరుతున్నారు. ఇది నిజంగా ఆదాయపు పన్ను శాఖ నుండి వచ్చిన నోటీసే అయినా.. వాటి వల్ల ఎలాంటి టెన్షన్కు గురికావాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఈ నోటీసుల అర్థం ఏమిటి..?ఎందుకు పంపుతోందో ఐటీ శాఖ క్లారిటీ ఇచ్చింది.
సలహా మాత్రమే.. నోటీసు కాదు: ఆదాయపు పన్ను శాఖ
పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసమే ఇలాంటి సలహాలను పంపుతున్నామని ఆదాయపు పన్ను శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారులకు పంపిన ఈ సందేశం నోటీసు కాదు, సలహా మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. ఐటీఆర్ బహిర్గతం, రిపోర్టింగ్ యూనిట్ నుండి అందుకున్న సమాచారం మధ్య వ్యత్యాసం ఉన్న సందర్భాలలో ఇది పంపడం జరుగుతోందని తెలిపింది. ఐటీ శాఖ కంప్లయన్స్ పోర్టల్లో ఆన్లైన్లో తమ అభిప్రాయాన్ని పూరించడానికి, అవసరమైతే, రిటర్న్ దాఖలు చేయకపోతే వారి రిటర్న్ను సవరించడానికి పన్ను చెల్లింపుదారులకు అవకాశం కల్పించడం ఈ కమ్యూనికేషన్ ఉద్దేశమని ఐటి శాఖ తెలిపింది.
మరీ ఈ సందేశం వస్తే ఏమి చేయాలి?
మీరు కూడా ఈ సందేశాన్ని స్వీకరించినట్లయితే ముందుగా మీ AIS అనగా వార్షిక సమాచార ప్రకటనను పొందండి. మీ రిటర్న్లతో AISని సరిపోల్చండి. ఏదైనా వ్యత్యాసం ఉంటే సవరించిన రిటర్న్ను పూరించండి. అలాగే కంప్లయన్స్ పోర్టల్కి వెళ్లి ప్రతిస్పందించండి.