Mon Mar 31 2025 11:51:06 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ఎవరన్నారు రియల్ ఎస్టేట్ పడిపోయిందని? ఒక్కసారి ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిందన్నది కేవలం ప్రచారం మాత్రమే

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిందన్నది కేవలం ప్రచారం మాత్రమే. ధరలు ఏ మాత్రం తగ్గలేదు. కొనుగోళ్లు కొంత వరకూ తగ్గి ఉండవచ్చేమో కానీ, ఇతర నగరాలకంటే హైదరాబాద్ లో స్థిరపడాలనుకునే వారి సంఖ్య ఈరోజుకు కూడా ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాంతంలోనూ భూముల ధరలు ఏమాత్రం తగ్గడం లేదన్నారు. ఇందుకు ఒక ఉదాహరణ చెప్పాలంటే తెల్లాపూర్ లో చదరపు గజం ధర ఎనభై వేల రూపాయలు పలుకుతుంది. నిజానికి రియల్ ఎస్టేట్ రంగం ఏ మాత్రం పడిపోయినా భూముల ధరలు పెరగవు.కనీసం స్థిరంగానైనా కొనసాగేవని రియల్ ఎస్టేట్ వ్యాపారులే చెబుతున్నారు.
ట్రంప్ ప్రభావంతో కొంత...
అయితే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రభావం కొంత రియల్ ఎస్టేట్ పై పడిందని కొందరు అంగీకరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయ కుటుంబాలపై ఎక్కువగా ప్రభావం చూపాయి. దీంతో కొంత కొనుగోళ్లు ఈ ఏడాది జనవరి నెల నుంచి కొంత తగ్గింది వాస్తవమే అయినా పూర్తిగా పడిపోయాయన్నది అవాస్తవమని, కేవలం బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పించి ఇంకా ధరలు భవిష్యత్ లో పెరుగుతున్నాయని తెలిపారు. ఇక ఫ్యూచర్ సిటీ సమీపంలోనూ ఇటీవల భూముల ధరలకు రెక్కలు వచ్చాయని, అక్కడ ఎకరం పొలం ధర యాభై లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకూ పలుకుతుందని తెలిపారు.
బెంగళూరు, చెన్నై నగరాలకు మించి...
ఇతర రాష్ట్రాల రాజధానుల కల్లా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం నిత్యం రైజింగ్ లోనే ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. బెంగళూరు నగరంలో కనీసం యాభై లక్షలకు డబుల్ బెడ్ రూం కొనలేని పరిస్థితి ఉందని, అక్కడి ట్రాఫిక్ తో పాటు తాగునీటి ఇబ్బందులు, భూగర్భజలాలు ఎండిపోవడం, వర్షాకాలంలో మునిగిపోవడం వంటివి హైదరాబాద్ లో లేని కారణంగా ఎక్కువ మంది స్థిరాస్థిపై పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. అదే సమయంలో చెన్నై లాంటి నగరంలోని వాతావరణం కూడా సహకరించకపోవడంతో ఇప్పటికీ రియల్ ధరలు ఏమాత్రం తగ్గలేదని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త వెంచర్లు పుట్టుకొస్తుండటమే ఇందుకు ఉదాహరణ అని అంటున్నారు. ఈ రెండు నగరాలు పరిధికి మించి విస్తరించడం కూడా హైదరాబాద్ లో కొనుగోళ్లు పెరగడానికి కారణంగా చెబుతున్నారు.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి...
అయితే హైడ్రా వచ్చిన తొలినాళ్లలో కొంత రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్న మాట వాస్తవమే అయినప్పటికీ ఇప్పుడు అన్నీ సరిచూసుకుని, న్యాయవాదులతో సరి చూపించుకుని కొనుగోలు చేసేవారి సంఖ్య ఎక్కువగా కనపడుతుందని తెలిపారు. మరోవైపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి భూముల విలువ పెరుగుతుందని మంత్రి చెప్పిన తర్వాత గత రెండు రోజుల నుంచి రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు. గతంలో ఎన్ఆర్ఐలు కొంత ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేసినా తర్వాత తిరిగి గత రెండు నెలల నుంచి పుంజుకోవడంతో రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లితుందని, అయితే అన్ని సదుపాయలను, న్యాయపరంగా చిక్కులు ఏమీ లేవని తెలుసుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేస్తున్నందున కొంత ఆలస్యమవుతుందని రియల్ రంగ నిపుణులు అంటున్నారు.
Next Story