Mon Dec 15 2025 03:56:39 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖపట్నం జూ పార్క్ లో ఊహించని విషాదం
విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో సోమవారం విషాద

విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో సోమవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి బి.నగేష్ (25) ఎలుగుబంటి ఎన్ క్లోజర్ ను శుభ్రం చేస్తుండగా ఎలుగుబంటి దాడి చేసింది. బోను తలుపు తెరిచి ఉండడం గమనించకుండా నగేష్ పని చేసుకుంటూ ఉండగా జంతువు దాడి చేసింది.
ఎలుగుబంటి ఎన్ క్లోజర్ పరిసరాల్లో నగేష్ క్లీన్ చేస్తుండగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. ఎన్ క్లోజర్ శుభ్రం చేసే సమయంలో ఎలుగుబంటి ఎన్ క్లోజర్ గేట్ మూసి వేసి ఉండాలి. అయితే ఆ గేట్ ఓపెన్ అయ్యి ఉండడంతో బయటకు వచ్చిన ఎలుగుబంటి నగేష్ పై దాడికి పాల్పడింది. నగేష్ పై దాడి చేస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో సందర్శకులు కూడా ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన జూ అధికారులు ఆ ఎలుగుబంటిని బంధించారు. తీవ్ర గాయాల పాలైన ఉద్యోగి నగేష్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటనపై ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

