Mon Dec 15 2025 04:08:39 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. చేతబడి జరిగిందా ?
తమ ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారని తెలిపారు. రోజూ రాత్రి వేళ నిమ్మకాయలు, దీపాలు పెట్టి..

ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతోన్న విద్యార్థిని ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లోని భరత్ నగర్ లో చోటుచేసుకుంది. బాలిక ఆత్మహత్యకు అసలు కారణాలు తెలియలేదు కానీ.. కూతురిపై క్షుద్రపూజలు లేదా చేతబడి జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కుల్సుంపుర పోలీస్స్టేషన్ పరిధిలోని భరత్నగర్ కు చెందిన నవ్య అనే విద్యార్థిని స్థానిక జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది.
బుధవారం(జూన్ 7) రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని బలన్మరణానికి పాల్పడింది. ఉదయాన్నే తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా.. వారు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కూతురి ఆత్మహత్యపై తల్లిదండ్రుల ఆరోపణలు మరోలా ఉన్నాయి. తమ ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారని తెలిపారు. రోజూ రాత్రి వేళ నిమ్మకాయలు, దీపాలు పెట్టి వెళ్తున్నారని, ఎవరో చేతబడి లాంటి క్షుద్రపూజలు చేశారని, అందుకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని నవ్య తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా క్షుద్ర పూజల వల్లనే నవ్య ఆత్మహత్య చేసుకుందా లేక మరేదైనా కారణం వల్ల మృతి చెందిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story

