Thu Apr 10 2025 11:14:38 GMT+0000 (Coordinated Universal Time)
కబడ్డీ క్రీడాకారిణిపై కోచ్ అత్యాచారం.. పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
2015లో కోచ్ జోగిందర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన అనుమతి లేకుండా తనతో లైంగిక చర్యలకు పాల్పడ్డాడని..

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడితో పాటు కోచ్ లపై ఇటీవల క్రీడాకారులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహరం తేలకముందే క్రీడారంగంలో మరో అత్యాచార ఘటన వెలుగుచూసింది. తాజాగా.. తనపై కోచ్ అత్యాచారానికి పాల్పడినట్లు కబడ్డీ క్రీడాకారిణి ద్వారకలోని బాబా హరిదాస్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు గతంలో జాతీయ మహిళా కబడ్డీ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2012లో బాధితురాలు కబడ్డీ ఆటలో పాల్గొనేందుకు హిరాన్ కుడ్నాలో సిద్ధమైంది. 2015లో కోచ్ జోగిందర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన అనుమతి లేకుండా తనతో లైంగిక చర్యలకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేసింది. అలాగే 2018లో తనకు వచ్చిన ప్రైజ్ మనీలో వాటా ఇవ్వాలని బెదిరించాడని, దాంతో అతని అకౌంట్ కు రూ.43.5 లక్షలు బదిలీ చేసినట్లు తెలిపింది. 2021లో బాధితురాలికి వివాహమైంది. అప్పట్నుండీ జోగిందర్ మళ్లీ వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.
తనకు సహకరించకపోతే.. ప్రైవేట్ ఫొటోలను లీక్ చేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. తనపై జరిగిన అత్యాచారంపై బాధితురాలు కోర్టులో వాంగ్మూలం కూడా ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడైన జోగిందర్ పరారీలో ఉండటంతో.. అతనికోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది.
Next Story