Wed Mar 26 2025 15:29:43 GMT+0000 (Coordinated Universal Time)
శబరిమల యాత్రికులకు ఉచితంగా బీమా కవరేజీ
నవంబర్ నెలలో ప్రారంభం కానున్న మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్లో

నవంబర్ నెలలో ప్రారంభం కానున్న మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్లో అయ్యప్ప స్వామిని దర్శించుకునే శబరిమల యాత్రికులకు ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా కవరేజీని అందించనున్నారు. ఈ ఏడాది శబరిమలకు వచ్చే యాత్రికులందరికీ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టిడిబి) బీమా కవరేజీని ప్రవేశపెట్టింది. ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డు ఈ సరికొత్త బీమా పథకానికి ప్రీమియం చెల్లిస్తుంది.
శబరిమల వచ్చే అయ్యప్పస్వాములకు ఉచితంగా జీవిత బీమా సదుపాయం కల్పించాలని సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు శబరిమల యాత్ర సందర్భంగా మరణిస్తే, వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందించనున్నారు. ఆ భక్తుడి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తుంది. శబరిమల ఆలయం నవంబరు 16న తెరుచుకోనుంది.
తీర్థయాత్ర సందర్భంగా శబరిమలలో 13,600 మంది పోలీసు అధికారులు, 2,500 మంది అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది, 1,000 మంది పారిశుద్ధ్య సిబ్బందిని మోహరించనున్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. యాత్రికులు చేరుకునే అన్ని ప్రాంతాలకు సరిపడా తాగునీటి సరఫరా జరిగేలా జలమండలి విస్తృత ఏర్పాట్లు చేసింది.
Next Story