Mon Dec 15 2025 04:00:17 GMT+0000 (Coordinated Universal Time)
Virat Kohli: బ్రేకింగ్: విరాట్ కోహ్లీ పబ్ పై కేసు నమోదు
విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ పబ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు

నిర్ణీత సమయానికి మించి ఓపెన్ చేసి ఉంచినందుకు విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ పబ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సమయానికి మించి ఆపరేట్ చేస్తున్నందుకు MG రోడ్లోని అనేక ఇతర పబ్, బ్రీవరీలపై బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డిసిపి సెంట్రల్ ప్రకారం.. పబ్లు అర్ధరాత్రి 1.30 గంటల వరకు తెరిచి ఉంచారు. అనుమతి ఇచ్చింది ఉదయం 1 గంట వరకూ మాత్రమే. ఈ సమయంలో అర్థరాత్రి బిగ్గరగా సంగీతం వినిపిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. చిన్నస్వామి క్రికెట్ స్టేడియం సమీపంలో ఉన్న వన్8 కమ్యూన్ పబ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేశారు. "రాత్రిపూట కూడా బిగ్గరగా సంగీతం ప్లే చేస్తున్నట్లు మాకు ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది, తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం" అని పోలీసు అధికారి తెలిపారు.
విరాట్ కోహ్లీ One8 కమ్యూన్ ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, కోల్కతా వంటి నగరాల్లో ఫ్రాంచైజీలను కలిగి ఉంది. గత ఏడాది డిసెంబర్లో బెంగళూరు బ్రాంచ్ను ప్రారంభించారు. ఇది రత్నం కాంప్లెక్స్లోని ఆరవ అంతస్తులో ఉంది. లుంగీ ధరించినందుకు వన్8 కమ్యూన్ లోని ముంబై బ్రాంచ్లోకి తనను లోపలికి రానివ్వలేదని ఓ నెటిజన్ చేసిన ఆరోపణలు గత ఏడాది వైరల్ అయ్యాయి. ఇప్పుడు బెంగళూరు బ్రాంచ్ మీద కేసు నమోదవ్వడంతో మరోసారి కోహ్లీ పబ్ వార్తల్లో నిలిచింది.
Next Story

