Sun Mar 30 2025 22:10:24 GMT+0000 (Coordinated Universal Time)
India vs Australia T20 : సిరీస్ మనదే... అందరూ రాణించారనే అనుకోవాలా
భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ 20 ఉత్కంఠ మధ్య సాగింది. సిరీస్ భారత్ సొంత మయింది

భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ 20 ఉత్కంఠ మధ్య సాగింది. ఫలితం ఎవరి వైపు ఉంటుందన్న దానిపై చివరి ఓవర్ వరకూ టెన్షన్ కొనసాగింది. కానీ చివరకు భారత్ దే పై చేయి అయింది. టీ 20 సిరీస్ ఇండియా పరమైంది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు తొలి విడత బరిలోకి దిగిన ఇండియాకు ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. వరసబెట్టి బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. ఓపెనర్లుగా దిగిన యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్ నిలకడగా ఆడుతున్నారనుకున్న సమయంలో జైశ్వాల్ అవుట్ కావడం నిరాశపరిచింది.
తక్కువ పరుగులకే...
యశస్వి జైశ్వాల్ 37 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఎనిమిది పరుగులకే అవుట్ కావడంతో ఇండియన్ ఫ్యాన్స్ లో కంగారు మొదలయింది. ఇక సూర్యకుమార్ కూడా అంతే. అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. దీంతో భారతమంతా రింకూసింగ్, జితేష్ శర్మపై పడింది. ఇద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరును పెంచారు. కానీ గత మ్యాచ్ లలో 200 పరుగులకు పైగానే సాధించిన భారత్ ఈ మ్యాచ్ లో అతి తక్కువగా 174 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సిరీస్ సమం అవుతుందేమోనని డౌట్ వచ్చింది. కానీ రింకూ సింగ్, జితేష్ శర్మ వల్ల ఆ మాత్రమైనా స్కోరు లభించిందని చెప్పాలి.
ఇరవై పరుగుల తేడాతో...
ఇక తర్వాత ఛేదనలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా హెడ్, ఫిలిప్ కొంత భయపెట్టేశారు. భారీ పరుగులు రాబట్టుకోవడంతో ఊదేస్తారని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ రవి బిష్ణోయ్ మ్యాజిక్ తో వికెట్ ను తీయడంతో ప్రారంభమైన ఆసీస్ పతనం చివర వరకూ కొనసాగుతూనే ఉంది. అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీసి మ్యాచ్ ను రసకందాయంలో పడేశాడు. అయినా ఆసీస్ కు స్ట్రాంగ్ అయిన బ్యాటింగ్ లైనప్ ఉండటంతో కొంచెం అనుమానంగానే ఉంది. కానీ డెత్ ఓవర్లలో ముఖేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ లు సూపర్బ్ గా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో ఇరవై ఓవర్లకు ఆసీస్ 154 పరుగులు చేసింది. ఇరవై పరుగుల తేడాతో ఆసీస్ ఓటమి పాలయింది. సిరీస్ మన చేతికి చిక్కింది.
Next Story