Sun Dec 14 2025 10:03:23 GMT+0000 (Coordinated Universal Time)
Congress : ముందుగానే క్యాంప్కు కాంగ్రెస్ అభ్యర్థులు
ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ అప్రమత్తమయింది. అభ్యర్థులను కర్ణాటక తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది

ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ అప్రమత్తమయింది. తమ పార్టీ అభ్యర్థులను కర్ణాటక తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఏ మాత్రం తేడా రాకుండా కాంగ్రెస్ హైకమాండ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఫలితాలకు ఇంకా రెండు రోజులు గడువు ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ ఇతర పార్టీల వైపు చూడకుండా ఈ చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది.
డీకే ఆధ్వర్యంలో...
ఇందుకోసం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. తెలంగాణలో దాదాపు 65 నుంచి 70 నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో అధికార పార్టీ ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా వారిని ముందు జాగ్రత్త చర్యగా క్యాంప్ నకు తరలించే యోచనలో ఉన్నట్టు తెలిసింది.
క్యాంప్ కు తరలించడానికి...
ఒక వేళ అటు ఇటుగా వచ్చినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ గీత దాటకుండా ఉండేందుకు హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ వారిని క్యాంప్ లోనే ఉంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతోనే కాంగ్రెస్ అభ్యర్థులను కర్ణాటకకు తరలించి అక్కడ ఉంచాలని హైకమాండ్ చేసిన సూచనను డీకే శివకుమార్ అమలు చేస్తున్నారని చెబుతున్నారు.
Next Story

