Sun Apr 28 2024 17:30:33 GMT+0000 (Coordinated Universal Time)
ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్
ప్రజా గాయకుడు గద్దర్ ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గద్దర్ తుదిశ్వాస విడిచారు.
ప్రజా గాయకుడు గద్దర్ ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గద్దర్ తుదిశ్వాస విడిచారు. గద్దర్ మరణంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్ అని, ఆయన పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే అని గుర్తుచేసుకున్నారు. ప్రజా గాయకుడు గద్దర్ భౌతికకాయానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. ఎల్బీ స్టేడియానికి చేరుకున్న పవన్ కల్యాణ్.. గద్దర్ పార్ధీవదేహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చారు. గద్దర్ కుటుంబసభ్యులు పవన్ను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. గద్దర్ మరణించారంటే నమ్మశక్యం కావడం లేదని, ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని పవన్ కొనియాడారు.
ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు గద్దర్ గారి మరణం తీవ్ర విషాదకరం అన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తన పాటలతో, మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని సైతం ఉత్తేజపరిచిన విప్లవ వీరుడి మరణం సందర్భంగా జనసేన పార్టీ తరపున నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గద్దర్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేపు మ.12 గంటలకు గద్దర్ అంతిమయాత్ర జరగనుంది. ఎల్బీ స్టేడియం నుంచి ఇంటి వరకు అంతిమయాత్ర ఉంటుంది. గద్దర్ ఆఖరి కోరిక మేరకు అల్వాల్ మహాబోధి స్కూల్ గ్రౌండ్లో అంత్యక్రియలు జరగనున్నాయి.
Next Story