Thu Apr 10 2025 09:42:09 GMT+0000 (Coordinated Universal Time)
ముందస్తు ఎన్నికలు రావొచ్చు.. సిద్ధమవ్వండి : చంద్రబాబునాయుడు
టీడీపీ నేతలు ప్రజలకు మరింత చేరువ కావాలని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఎలాంటి సవాళ్లనైనా..

అమరావతి : ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. సిద్ధంగా ఉండాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2024 కంటే ముందే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. అందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నాయుడు అన్నారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన టీడీపీ అధినేత.. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్ముకుంటున్నారని.. మన వైపే ఆశగా చూస్తున్నారని అన్నారు. వైసీపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు.
అన్ని స్థాయిల టీడీపీ నేతలు ప్రజలకు మరింత చేరువ కావాలని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు టీడీపీ శ్రేణులు, నేతలు సిద్ధంగా ఉండాలని అన్నారు. చంద్రబాబు నాయుడు పార్టీ మండల, గ్రామ కమిటీలతో సమావేశం నిర్వహించి బాదుడే బాదుడు, పార్టీ సభ్యత్వ నమోదు, ఓటరు ధ్రువీకరణ, మహానాడు ఏర్పాట్లపై చర్చించారు. పార్టీ నాయకులు తమ తమ ప్రాంతాల్లోని ప్రతి ఇంటిని సందర్శించాలని సూచించారు. మూడేళ్లుగా తప్పుడు విధానాల వల్ల అన్ని వర్గాలు టీడీపీ నేతలకు స్వాగతం పలుకుతూ.. తమ బాధలను చెప్పుకుంటూ ఉన్నాయన్నారు.
రాష్ట్ర ప్రజల్లో రోజురోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని.. ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేమనే విషయం జగన్కు అర్థమవుతోందని అన్నారు. జగన్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు బూటకమని, వర్గాలతో తేడా లేకుండా అందరిలోనూ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. అందుకే సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలు టీడీపీపైనే ఆశలు పెట్టుకున్నారని.. గ్రామాల్లో టిడిపికి స్వాగతాలు, గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసిపి నేతలకు నిలదీతలే ఇందుకు సాక్ష్యాలన్నారు.
Next Story