Sun Dec 14 2025 18:17:43 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : నేడు మరో 13 విమానాలు
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ 13,300 మంది భారతీయులను తీసుకు వచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే పదిహేను విమానాల ద్వారా మూడు వేల మందిని భారత్ కు తీసుకువచ్చామని తెలిపింది. కేంద్ర మంత్రులు వెళ్లిన తర్వాత విమానాల సంఖ్య పెరగడంతో పాటు వేగంగా తరలింపు జరుగుతుంది.
సుమీలోనే....
ఆపరేషన్ గంగా పేరిట చేపట్టిన ఈ కార్యక్రమంలో ఈరోజు మరో పదమూడు విమానాల ద్వారా భారతీయులను తీసుకురానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ విమానాల ద్వారా మరో మూడు వేల మందిని తీసుకు వస్తామని చెప్పింది. సుమీలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు తెలియడంతో వారిని అక్కడి నుంచి సురక్షితంగా తరలించేందుకు ప్రణాళిక రూపొందించింది. నిన్న రష్యా ఐదున్నర గంటల పాటు కాల్పుల విరమణ ప్రకటించిన సమయంలో ఎక్కువ మందిని సుమీ నుంచి తరలించినట్లు తెలుస్తోంది. ఇంకా ఉక్రెయిన్ లో రెండు నుంచి మూడు వేలకు మించి భారతీయులు లేరని పేర్కొంది.
Next Story

