అందమైన విలన్‌లు అదరగొడుతున్నారు!

Update: 2016-10-24 13:48 GMT

ఇటీవలి కాలంలో ప్రతినాయకులు అంటే మోటుగా ఉండితీరాలి అనే నిబంధనలు సడలిపోయాయి. అందుకే మన చిత్రాలలో విలన్ల పాత్రలను చాలా స్టైలిష్ గా తీర్చిదిద్దుతున్నారు మన దర్శక రచయితలు. ఈ మోజులో పడి కథానాయకుడిగా గుర్తింపు వున్న నటులను కూడా వదలకుండా ప్రతినాయకులని చేసేస్తున్నారు నేటి తరం దర్శకులు. తన్ని ఊరువం లో అరవింద్ స్వామి, సరైనోడు చిత్రంలో ఆది పినిశెట్టి లాంటి హీరోలు ప్రతినాయకులుగా డబల్ పాపులారిటీ సంపాదించుకున్నారు.

దర్శకుడు శంకర్ పంథానే వేరు. ఆయన ఏకంగా హాలీవుడ్ హీరోలను రోబో 2 చిత్రంలో విలన్ పాత్రకు సంప్రదించి అనివార్య కారణాల వల్ల వెనక్కి తగ్గి బాలీవుడ్ లో పెద్ద హీరో అక్షయ్ కుమార్ తో ఆ పాత్ర లో నటింపజేస్తున్నారు. ఇప్పుడు మామ చెయ్యలేకపోయింది అల్లుడు చేసేలా వున్నాడు. పిజ్జా ఫేమ్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ధనుష్ ఒక చిత్రం చెయ్యబోతున్నాడు. ఆ చిత్రంలోని విలన్ పాత్ర కోసం హాలీవుడ్ ఫేమస్ యాక్టర్ ఆల్ పసినో తో చర్చలు జరుపుతున్నారు. అన్ని కుదిరి ఆల్ పసినో ఈ తమిళ చిత్రంలో చెయ్యటానికి అంగీకారం తెలిపితే అది గొప్ప సంచలనమే అవుతుంది.

పిజ్జా తో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, ఇప్పుడు చెయ్యబోయే ధనుష్ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చెయ్యటానికి యోచిస్తున్నారు.

Similar News