సోనమ్ కపూర్ కూడా ఇటు కన్నేసింది

Update: 2016-10-09 14:01 GMT

దక్షిణ భాషా చిత్రాలలో గుర్తింపు తెచ్చుకుని ఆ గుర్తింపుని బాలీవుడ్లో కాలుమోపటానికి వారధిగా చేసుకుంటుంటారు కథానాయికలు. ఐశ్వర్య రాయ్ బచ్చన్, శ్రీయ శరన్, కాజల్ అగర్వాల్, జెనీలియా డి సౌజ, ఇలియానా లాంటి వారెందరో ఆ కోవకే చెందుతారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బాలీవుడ్లో అగ్ర కథానాయికలుగా చేతి నిండా అవకాశాలతో తీరిక లేకుండా ఉండే భామలు కూడా తమిళ సినిమా అవకాశాలు తలుపు తడితే కాదనకుండా ఒప్పేసుకుంటున్నారు. ఆ స్థాయిలోనే పారితోషికాలు కూడా అందుకుంటున్నారు అనుకోండి. దీపికా పదుకొనే, సోనాక్షి సిన్హా ఇలా వచ్చినవారే.

ఇప్పుడు దీపికా, సోనాక్షిల తరహా లోనే తమిళ పరిశ్రమలో అడుగుపెడుతున్న మరో బాలీవుడ్ భామ సోనమ్ కపూర్. గతంలో సోనమ్ కపూర్ నటించిన రాంజన అనే హిందీ చిత్రంలో తమిళ నటుడు ధనుష్ నటించారు. ఇప్పుడు కూడా ధనుష్ చిత్రంతోనే కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది సోనమ్. సూపర్ స్టార్ రజని కాంత్ ద్వితీయ కుమార్తె సౌందర్య రజని కాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి నిలవుక్కు ఎన్మేల్ ఎన్నదీ కోపం అనే పేరు ఖరారు చేసారు. ఈ చిత్రంలో మలయాళం మెగా స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారు.

సోనమ్ కపూర్ ఈ తమిళ చిత్రంతో పాటు వీరెయ్ ది షాదీ అనే హిందీ చిత్రంలోనూ నటించనుంది. ఈ రెండు చిత్రాలు 2017 లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Similar News