ఆప్ఘన్ లో మరో మారణకాండ.. బాంబుల దాడిలో 20 మంది మృతి

ఈ ఘటనలో దాదాపు 20 మంది మరణించినట్లు అక్కడి అధికారులు చెప్తున్నారు. ఈ దాడిలో ఆఫ్ఘన్ పౌరులతోపాటు..

Update: 2022-09-05 13:55 GMT

తాలిబన్ల పాలిత దేశమైన ఆప్ఘనిస్థాన్.. మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. ఆప్ఘన్ రాజధాని కాబూల్ లో జరిగిన బాంబుల దాడిలో 20 మంది మరణించారు. స్థానిక రష్యన్ ఎంబసీ గేట్ వద్ద సోమవారం ఉదయం ఈ దాడి జరిగింది. చాలామంది పౌరులు వీసాల కోసం ఎంబసీ గేట్ వద్దకు చేరుకున్న సమయంలో ఈ దాడి జరిగింది. తొలుత ఎంబసీ గేట్ వద్దనున్న ఓ దుండగుడిని తాలిబన్ పోలీసులు గుర్తించి.. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ దుండగుడు తనవద్దనున్న బాంబుల్ని విసిరేయడంతో.. అవి ఎంబసీ గేటు వద్ద పడి పేలాయి.

ఈ ఘటనలో దాదాపు 20 మంది మరణించినట్లు అక్కడి అధికారులు చెప్తున్నారు. ఈ దాడిలో ఆఫ్ఘన్ పౌరులతోపాటు రష్యాకు చెందిన ఇద్దరు దౌత్యాధికారులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కాగా.. ఆత్మాహుతికి యత్నించి దాడికి పాల్పడిన దుండుగుడిని అధికారులు కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత శుక్రవారం కూడా ఒక మసీదువద్ద ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరగ్గా.. ఆ ఘటనలోనూ సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు.


Tags:    

Similar News