Ap Elections : అందిన రిపోర్టులే హస్తినలోని పెద్దల ఆలోచనల్లో మార్పు వచ్చాయా? చీఫ్ సెక్రటరీ అందుకే ఉన్నారా?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా ఆరు రోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయి

Update: 2024-05-29 12:27 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా ఆరు రోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయి. అయితే ఇప్పటికే అనేకరకాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నివేదికలు తెప్పించుకునట్లు తెలిసింది. అయితే ఇందులో కొంత వైసీపీకే అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉండటంతో కొంత వైఖరి మారిందని అంటున్నారు. అందుకే చీఫ్ సెక్రటరీ విషయంలో టీడీపీ చేస్తున్న డిమాండ్ ను పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాదనలు బలంగా ఢిల్లీలో హల్ చల్ చేస్తున్నాయి. ఏమాత్రం కూటమికి అధికారం వస్తుందని తెలిస్తే ఈపాటికి టీడీపీ కోరినట్లు చీఫ్ సెక్రటరీని బదిలీ చేయించే పనికి బీజేపీ పూనుకుని ఉండేదన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ తో...
ఎన్నికలు పూర్తయిన తర్వాత కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలతో పాటు తమకు నమ్మకమైన వారితో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించుకున్నట్లు ఢిల్లీలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. ఒక బీజేపీ నేత ఈ సర్వేను చేయించి సమగ్ర నివేదికను అధినాయకత్వానికి ఇచ్చారంటున్నారు. వైసీపీకి 110 స్థానాలు వచ్చే అవకాశముందని చెప్పడంతో బీజేపీ కొంత వెనకడుగు వేసినట్లు తెలిసింది. జూన్ 1వ తేదీన ఎటూ ఎగ్జిట్ పోల్స్ వస్తున్నప్పటికీ ముందుగా అన్ని రాష్ట్రాలలో జరిగే ఎన్నికల సరళిని, పోలింగ్ రోజు ప్రజాభిప్రాయాన్ని సేకరించిన సంస్థల చేత ప్రత్యేకంగా బీజేపీ తెప్పించుకున్నట్లు వార్తలు గుప్పు మంటున్నాయి. అందులో భాగంగానే ఏపీ విషయంలోనూ నివేదికలు తెప్పించుకున్న బీజేపీ వైసీపీ పట్ల సాఫ్ట్‌ కార్నర్ గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
ఎన్డీఏకు ఈసారి...
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కూడా తాము అనుకున్న స్థానాలు వచ్చే అవకాశం లేదని ఎన్డీఏ కూటమి భావిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లోనే భారీ సంఖ్యలో సీట్లకు గండిపడే అవకాశముందన్న నిఘా సంస్థల నివేదికలు కొంత కమలం పార్టీలో కలవరం పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ మిత్రులనే కాకుండా ఎవరినీ శత్రువులను చేసుకోకూడదన్న ఉద్దేశ్యంతో వ్యవహరిస్తుందంటున్నారు. ఎన్నికల ముందు వరకూ కూటమి పార్టీలు చెప్పినట్లు అందరూ అధికారులు బదిలీ అయిపోయారు. డీజీపీ నుంచి కింది స్థాయి అధికారుల వరకూ ఎణ్నికల కమిషన్ పై వత్తిడి తెచ్చి వారిని పక్కన పెట్టించడంలో ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సక్సెస్ అయ్యారు. ఎలక్షనీరింగ్ లో జగన్ ను ఎదుర్కొనడానికి వాళ్లు చివరకు చేసిన ప్రయత్నాలు ఫలించాయనే చెప్పాలి.
సీఎస్ విషయంలో...
అయితే చీఫ్ సెక్రటరీ విషయంలో మాత్రం కుదరలేదట. కౌంటింగ్ కు ముందు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని బదిలీ చేయాలని టీడీపీ ఇప్పటికే డిమాండ్ చేస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసింది. అయితే చీఫ్ సెక్రటరీని మాత్రం ఎన్నికల కమిషన్ ఇంత వరకూ మార్చలేదు. ఆయన సీఎస్ గా ఉంటే ఫలితాలపై ప్రభావం చేస్తారని కూడా టీడీపీ ఆరోపించింది. చీఫ్ సెక్రటరీ బదిలీ చేయాలన్న డిమాండ్ ను మాత్రం ఏపీ బీజేపీ నేతలు చేయకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయనపై విమర్శలు చేయడం లేదన్న టాక్ వినపడుతుంది. మరోవైపు ఆయనపై కొందరు భూకబ్జా ఆరోపణలు కూడా చేస్తుండటం కూడా బదిలీ చేయించాలన్న కారణమేనన్న వాదన బలంగా వినిపిస్తుంది. అయినా జవహర్ రెడ్డిని కదపకపోవడం వెనక కేంద్రానికి అందిన నివేదికలే కారణమన్న ప్రచారం హస్తినలో గుప్పు మంటోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో?


Tags:    

Similar News