ఆరోజు విశాఖలోనే బాబు...ఏం జరగబోతోంది?

Update: 2017-01-24 06:00 GMT

ఈ నెల 26వ తేదీ విశాఖలో ఏం జరుగుతుందోనని టెన్షన్. విశాఖ సాగర తీరంలో ప్రత్యేక హదా డిమాండ్ తో ఏపీ యూత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దయెత్తున మద్దతు లభిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే విస్తృత ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా యూత్ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఆర్కేబీచ్ కు రావాలంటూ ఆహ్వానం పలుకుతోంది. అయితే ఈ కార్యక్రమానికి రాజకీయ పక్షాల నేతలు కూడా హాజరుకానున్నారు. కాంగ్రెస్, వైసీపీ, వామపక్షాల పార్టీల నేతలు హాజరై యువతకు అండగా నిలవనున్నారు.

అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విశాఖలోనే ఉంటున్నారు. 27వ తేదీ నుంచి విశాఖలో పార్ట్ నర్ షిప్ సమ్మిట్ లో పాల్గొనేందుకు చంద్రబాబు 26వ తేదీనే విశాఖకు చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస చేయనున్నారు. దీంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. 26వ తేదీ రిపబ్లిక్ డే కూడా కావడంతో భారీ బందోబస్తు అవసరమవుతుంది. ఇతర జిల్లాల నుంచి విశాఖకు పోలీసులను రప్పిస్తున్నారు.

ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాను ఇవ్వకపోవడంపై ఆడియో సిడీని ఈరోజు విడుదల చేయనున్నారు. పవన్ కల్యాణ్ కూడా విశాఖ కు వచ్చి మద్దతు తెలుపుతారని భావిస్తున్నారు. పవన్ విశాఖకు ఆరోజు వస్తే శాంతిభద్రతలు అదుపు తప్పే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. నిరసన కు పోలీసుల అనుమతి లేదని విశాఖ కమిషనర్ యోగానంద్ స్పష్టం చేశారు. నిరసన కోసం యువత మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Similar News