Tirumala : నేడు తిరుమల శ్రీవారి దర్శనం నేరుగా.. వేచి ఉండకుండానే?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు తక్కువగానే ఉంది. బుధవారం కావడంతో పాటు వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో భక్తుల సంఖ్య తగ్గింది

Update: 2024-09-25 03:29 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా తక్కువగానే ఉంది. బుధవారం కావడంతో పాటు వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో భక్తుల సంఖ్య తగ్గింది. గత మూడు రోజుల నుంచి భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. పెద్దగా కష్టపడకుండా, వేచి ఉండాకుండానే తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని మూడు రోజుల నుంచి దర్శించుకుంటున్నారు. ఒక్కొక్కరు రెండు సార్లు శ్రీవారిని కనులారా దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరిగి వచ్చే నెల మొదటి వారం నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో అప్పుడు విపరీతమైన రద్దీ పెరుగుతుందన్న అధికారులు అంచనాతో ఇప్పుడు మాత్రం భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. ఎక్కడా వేచి ఉండాల్సిన సమయం లేదు. కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. లడ్డూ కౌంటర్ల వద్ద కూడా పెద్దగా రద్దీ లేదు. దీంతో లడ్డూలు అధిక సంఖ్యలో భక్తులు కొనుగోలు చేస్తున్నారు. తిరిగి శుక్రవారం నుంచి రద్దీ మొదలయ్యే అవకాశాలున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భావిస్తున్నారు.

కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే...
తిరుమలలో గత కొద్ది రోజులుగా రద్దీ తగ్గినప్పటికీ హుండీ ఆదాయం మాత్రం తగ్గడం లేదు. భక్తుల సంఖ్య తక్కువగా ఆదాయం మాత్రం బాగానే ఉందని అధికారులు చెబుతున్నారు. ఈరోజు తిరుమల వైకుంఠం కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు ఖాళీగానే ఉన్నాయి. వచ్చినవారిని వచ్చినట్లుగానే నేరుగా స్వామి వారి దర్శనానికి పంపుతున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు ఆరు గంటల సమయం శ్రీవారి దర్శనానికి పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధకిారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనం భక్తులకు కేవలం రెండు గంటల్లోనే పూర్తవుతుంది. ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఒక గంటలో శ్రీవారి దర్శనం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 67,616 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,579 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.89 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News