ఏపీకి నిధుల వరద

Update: 2017-02-03 02:30 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ సమీకరణ ద్వారా రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించాలని నిర్ణయించడం రైతులకు కలిసొచ్చింది. రైతులకు సమన్యాయం అందించేవిధంగా ఓ కొత్త విధానం మన రాష్ట్రంలో రూపుదిద్దుకుంది. సిఎం పిలుపునకు స్పందించి రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు తమ భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఇంత భూమి ఈ విధంగా సమీకరించలేదు. ఇప్పటివరకు చరిత్రలో ప్రజావసరాలకు భూమిని రైతుల నుంచి బలవంతంగా సేకరించేవారు. స్వచ్ఛందంగా కూడా ఇలా భూ సమీకరణ చేయవచ్చని చంద్రబాబు నాయుడు ఓ కొత్త వరవడి సృష్టించారు. అనేక విషయాలతో పాటు ఈ విషయంలో కూడా ఆయన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి వచ్చినఇతర అంశాలను పరిశీలిస్తే, విజయవాడ నగర మెట్రో రైలుకు రూ.101 కోట్లు కేటాయించారు.

విద్యాలయాలకు కేటాయింపు...

రాష్ట్రంలోని ప్రకృతి వైపరీత్యాల ప్రాజెక్టుకు రూ.250 కోట్లు, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టుకు రూ.150 కోట్లు కేటాయించారు. ఏపీ సెంట్రల్ విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు, ఏపీ ట్రైబల్ విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు, ఏపీ ఐఐటీ(ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి రూ.50 కోట్లు, ఏపీ ఐఐఎం(ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ మెంట్)కు రూ.40 కోట్లు, ఏపీ ఎస్ఐటీ(నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి రూ.10 కోట్లు, ఏపీ ఐఐఎస్ఈఆర్(ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) కు రూ.50 కోట్లు, ఏపీ ఐఐఐటీ(ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)కి రూ.30 కోట్లు కేటాయించారు. విశాఖపట్నం పోర్టుకు రూ.15 కోట్లు కేటాయించారు. ఇవే కాకుండా మునిసిపల్ అభివృద్ధి, రోడ్డు సెక్టార్ వంటి ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించారు. రైల్వే బడ్జెట్ 2016-17లో ఏపీకి 2,195.7 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్ లో రూ.3,406 కోట్లు కేటాయించారు.

రాష్ట్ర వాటా ద్వారా...

ఇవే కాకుండా ఇతర పథకాలకు కేటాయించిన నిధులలో మన రాష్ట్రానికి వచ్చే వాటా ద్వారా పలు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్‌) గ్రామాలన్నింటికి పైపులైను ద్వారా నీరు సరఫరా చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. దీంతో రాష్ట్రంలో వేల గ్రామాలు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఆ గ్రామాల్లో కొళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన తాగునీరు సరఫరా చేస్తారు. బడ్జెట్ లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచినందున అవి గ్రామీణాభివృద్ధికి ఉపయోగపడతాయి. సీసీ రోడ్లు, నీటి కుంటలు వంటి వాటి నిర్మాణానికి ఈ నిధులను వినియోగించుకోవచ్చు. దేశ వ్యాప్తంగా సౌర విద్యుత్ కు రూ.4,034 కోట్లు కేటాయించారు. మన రాష్ట్రంలో 4వేల మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ పార్కులకు కూడా నిధులు కేటాయిస్తారు. సముద్ర తీర ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు కొత్త రోడ్లు నిర్మించడానికి నిధులు కేటాయించారు. మన రాష్ట్రంలో 974 కిలో మీటర్ల తీర ప్రాంతం ఉన్నందున ఇక్కడ రోడ్ల అభివృద్ధికి, కొత్త రోడ్ల నిర్మాణానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన వివిధ పన్నుల నుంచి రాష్ట్రానికి రూ.29,138.82 కోట్లు వచ్చాయి. మొత్తం కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా 4.305 శాతంగా ఉంది.

Similar News