Ys Jagan : జగ్గూ అన్నా .. వెళ్లిపోతున్నారన్నా... ఆపే ప్రయత్నం చేయరా?

ఆంధ్రప్రదేశ్ వైసీపీలో జోష్ కొరవడింది. కార్యకర్తల నుంచి నేతల వరకూ ఎవరూ కనిపించడం లేదు

Update: 2024-10-14 08:22 GMT

ys jagan 

ఆంధ్రప్రదేశ్ వైసీపీలో జోష్ కొరవడింది. కార్యకర్తల నుంచి నేతల వరకూ ఎవరూ కనిపించడం లేదు. జగన్ తో పాటు నేతలందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉందన్న ధోరణిిలోనే వారి ఆలోచనలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు మాత్రమే అయినందున పెద్దగా విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోరనే ధోరణి వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్నికల సమయం దగ్గరపడినప్పుడు చూసుకుందాములే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. అందుకే పెద్దగా బయటకు రావడం లేదు. బయటకువస్తే జేబులో చిలుం వదలడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదన్న భావనలో ఉన్నారని తెలిసింది.

వెళ్లడమే మంచిదని...
కానీ కొందరు నేతలు మాత్రం తాము పార్టీలో ఉండటం కంటే వెళ్లడమే మంచిదని భావిస్తున్నారు. ఎక్కువ మంది జగన్ కు గత ఐదేళ్ల కాలంలో సన్నిహితంగా మెలిగిన వారే పార్టీని వీడి వెళుతుండటం కూడా క్యాడర్ ను కలవరపరుస్తుంది. ఆళ్ల నాని, మోపిదేవి వెంకట రమణ లాంటి వాళ్లే పార్టీని వీడి వెళ్లారంటే ఇక మిగిలిన నేతల ఆలోచనలు ఏ విధంగా సాగుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. అందుకే ముఖ్యనేతలు కొందరు కూటమిలోని పార్టీలో చొరబడేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారన్న వార్తలు వస్తున్నాయి. ఏ పార్టీ అయితే వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ వస్తుందన్న అంచనా వేసుకుని మరీ జెండాను మార్చేందుకు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు.
జనసేనలో చేరేందుకు...
తాజాగా జనసేన పార్టీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతుదారుగా నిలిచిన రాపాక వరప్రసాదరావు వైసీపీని వీడారు. ఇది పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోయినప్పటికీ మరికొందరు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. దాదాపు నలుగురు వైసీపీ ముఖ్యనేతలు జంప్ చేయడానికి రెడీగా ఉన్నారు. జనసేనలో ఎంట్రీ కో్సం వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలు చాలా వరకూ ఫలించాయని చెబుతున్నారు. పార్టీ అధినేత వపన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే చేరికలు ఉంటాయని జనసేనపార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. తూర్పు, పశ్చిమ గోదావరిజిల్లాల నుంచి ఈ నేతలు పార్టీలో చేరతారని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.
వరసబెట్టి నేతలు...
వరసగా పార్టీ నేతలు వెళ్లిపోతున్నా జగన్ మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన ఎక్కువ కాలం బెంగళూరులోనే ఉంటున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందన్న వార్తలు వస్తున్నాయి. 2027లో శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశముందన్న వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో జగన్ ఇప్పటి నుంచే అందుబాటులో ఉండి, గ్రౌండ్ కు బయలుదేరకుంటే పార్టీకి ఇబ్బందులు తప్పవంటున్నారు. ఎన్నికల వ్యూహకర్తను, ఐ ప్యాక్ టీంవంటి వాటిని నమ్ముకోకుండా గ్రౌండ్ రియాలిటీతో జగన్ నిర్ణయాలు తీసుకోవాలని నేతలు సూచిస్తున్నారు. లేకుంటే మరోసారి పార్టీకి భంగపాటు తప్పదన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News