Chandrababu : తుపాన్ హెచ్చరికతో అలెర్ట్ అయిన చంద్రబాబు.. అధికారులతో ఏమన్నారంటే?

భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

Update: 2024-10-14 07:33 GMT

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్దతపై సమీక్షించారు. రాష్ట్రంలో ఈ సీజన్ లో 676 ఎంఎం సరాసరి వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 734 ఎంఎం వర్షపాతం నమోదయిందని తెలిపారు. 18 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, 8 జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కవ వర్షపాతం నమోదయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు తెలిపారు.

ముఖ్యమంత్రి ఆదేశాలు...
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. పర్యవేక్షణ ఉంచాలన్నారు. అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతంలో ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రజల మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై మెసేజ్ లు పంపి అలెర్ట్ చేయాలన్నారు.  చెరువు కట్టల, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టిపెట్టాలని, వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. రెయిన్ ఫాల్ వివరాలను కూడా రియల్ టైంలో అందుబాటులో ఉంచాలని చంద్రబాబు ఆదేశించారు.
ప్రాణ నష్టం లేకుండా...
అప్రమత్తతో ప్రాణ, ఆస్థినష్టం లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. కంట్రోల్ రూంల ఏర్పాటుతో ప్రజల వినతులపై వేగంగా స్పందించాలని, సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా చెరువులు, రిజర్వాయర్లు నిండేలా ఇరిగేషన్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కరుస్తాయని తెలపడంతో ప్రస్తుతం నెల్లూరులో 30 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యిందని అధికారులు సీఎంకు వివరించారు. రేపటి నుంచి వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో అవసరమైన ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ టీమ్ లను సిద్దంగా పెట్టినట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.


Tags:    

Similar News