ఏపీలో రేపటి నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె

ఏపీ విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో విద్యుత్ ఉద్యోగులు రేపు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నారు

Update: 2023-08-08 06:20 GMT

ఏపీ విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో విద్యుత్ ఉద్యోగులు రేపు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నారు. ఈ మేర‌కు విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ ఇప్పటికే యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. సమ్మె కార్యాచరణలో భాగంగా జేఏసీ నేతలు రేపు విజయవాడలోని విద్యుత్‌ సౌధ మ‌హా ధ‌ర్నాకు పిలుపునిచ్చారు. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ సౌధ వద్ద 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యుత్ ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో విజయవాడలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. దీంతో విద్యుత్ సౌధ ముట్టడిని జేఏసీ వాయిదా వేసుకుంది. ఈ క్ర‌మంలోనే ‘వర్కు టు రూల్‌’ ద్వారా నిరసన తెలపాలని నిర్ణయించినట్లు జేఏసీ నేత‌లు ప్రకటించారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విద్యుత్‌ సంస్థల యాజమాన్యంతో ఇవాళ కూడా చర్చల్లో పాల్గొననున్నట్లు జేఏసీ తెలిపింది.

1999లో వేతన సవరణ సహా ఇతర డిమాండ్లతో ఉమ్మడి ఏపీలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అప్ప‌టినుంచి 24 ఏళ్ల తర్వాత విద్యుత్ ఉద్యోగులు మళ్లీ సమ్మెకు సిద్ధమయ్యారు. 12 డిమాండ్లతో ఉద్యోగులు గత కొంత కాలంగా నిరసన వ్య‌క్తం చేస్తున్నారు. భోజన విరామ సమయాల్లో సర్కిల్, జోనల్, విద్యుదుత్పత్తి కేంద్రాలు, డిస్కమ్‌లు, జెన్కో, ట్రాన్స్‌కో ప్రధాన కార్యాలయాల్లో ఉద్యోగులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. దీంతో స్పందించిన‌ ప్రభుత్వం.. ఉద్యోగులను చర్చలకు పిలిచింది. ఆ చర్చలు విఫలం కావడంతో 10వ తేదీ నుంచి సమ్మె సైరన్ మోగించాలని ఉద్యోగులు నిర్ణయించారు.


Tags:    

Similar News