అందరికీ దడ దడేనటగా

రాజకీయాల్లో ఎప్పుడు వచ్చామన్నదికాదు.. ఎలా వచ్చామనేదే కీలకం. అంతేకాదు, ఎంత దూకుడుగా ఉన్నామనేది కూడా ముఖ్యం. ఇదే ఇప్పుడు గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజవకర్గం చిలకలూరి పేట [more]

Update: 2019-08-11 08:00 GMT

రాజకీయాల్లో ఎప్పుడు వచ్చామన్నదికాదు.. ఎలా వచ్చామనేదే కీలకం. అంతేకాదు, ఎంత దూకుడుగా ఉన్నామనేది కూడా ముఖ్యం. ఇదే ఇప్పుడు గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజవకర్గం చిలకలూరి పేట రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. ఇక్కడ అటు వైసీపీ నుంచి ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి కూడా సీనియర్‌ నాయకులు ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ రెండు పార్టీల నాయకులు కూడా దూకుడు ప్రదర్శిస్తున్నారు. వారే టీడీపీ నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, వైసీపీ నుంచి మర్రి రాజశేఖర్‌. ఈ ఇద్దరూ కూడా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. ఇద్దరూ కమ్మ వర్గానికి చెందిన వారే. మర్రి ఫ్యామిలీలో అయితే, ఆయన మామ దివంగ‌త సోమేప‌ల్లి సాంబ‌య్య నుంచి కూడా ఇక్కడ రాజకీయాలు చేశారు.

వైసీపీలోకి జంప్ చేసి మరీ….

అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇక్కడ అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నికలకు ముందు బీసీ వర్గానికి చెందిన ఎన్నారై మహిళ.. విడదల రజనీ రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత టీడీపీలో తీర్థం పుచ్చుకున్నారు. ఆమెను చంద్రబాబుకు పరిచయం చేసిన అప్పటి మంత్రి పుల్లారావుకే ఎసరు పెట్టేందుకు ప్రయత్నించారనే వ్యాఖ్యలువినిపించాయి. ఆమె.. పేట సీటు కోసం పట్టుబట్టారు. అయితే, చంద్రబాబు మాత్రం వేరే చోట ఇస్తామని, అక్కడ పుల్లారావుకు తప్ప వేరే వారికి ఛాన్స్‌లేదని చెప్పడంతో ఆమె వెంటనే పార్టీ ఫిరాయించి వైసీపీలోకి జంప్‌ చేసి,.. జగన్‌ను మెప్పించారు. ఈ క్రమంలోనే అక్కడ టికెట్‌ కోసం ఎదురు చూస్తున్న సీనియర్‌ మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవి ఇస్తానని బుజ్జగించిన జగన్‌.. విడదల రజనీకి టికెట్‌ ఖరారు చేశారు.

సవాల్ చేసి మరీ…..

సీటు రావ‌డంతో విడదల రజనీ వ్యూహాలు మారిపోయాయ్‌. ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గంపై గ్రిప్‌ పెంచుకునేందుకు విపరీతంగా కృషి చేశారు. అందరినీ కలిశారు. అందరినీ మెప్పించి ఎన్నికల్లో ప్రత్తిపాటిని ఓడించాలనే తన పంతాన్ని నెగ్గించుకుని విజయం సాధించారు. ఏ ప్రత్తిపాటి శిష్యురాలిగా ఉన్నారో అదే ప్రత్తిపాటిని ఓడిస్తాన‌ని స‌వాల్ చేసి మ‌రీ ఓడించారు. కీల‌క‌మైన చిల‌క‌లూరిపేట‌లో ఓ బీసీ మ‌హిళ‌గా విజ‌యం సాధించి స‌రికొత్త రికార్డు నెల‌కొల్పారు.

రాజకీయం మొదలెట్టి….

ఇక, ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఆమె దూకుడు పెంచారు. అధికారులతో సమీక్షల దగ్గర నుంచి ప్రజలతో అనుసంధానం వరకు కూడా సీనియర్లను తోసిరాజని, అంతా తానే అయి వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పుడు విడదల రజని రాజకీయం చాలా ఆసక్తిగా మారిందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. అటు టీడీపీని టార్గెట్ చేసే క్ర‌మంలో సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును టార్గెట్ చేస్తూనే ఇటు సొంత పార్టీలో సీనియ‌ర్ నేత‌గా ఉన్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు కూడా చెక్ పెట్టేలా ముందుకు వెళుతున్నారు.

మర్రిని పక్కన పెట్టి….

రేపో మాపో రాజ‌శేఖ‌ర్‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తే నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ఆధిప‌త్యానికి చెక్ ప‌డుతుంద‌న్న ఉద్దేశంతో రాజ‌శేఖ‌ర్ వ‌ర్గాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవ‌హ‌రించ‌డంతో పాటు రాజ‌శేఖ‌ర్ మాట కూడా నెగ్గకుండా చేస్తున్నార‌న్న టాక్ వ‌చ్చేసింది. ఎన్నిక‌ల ప్రచారం వ‌ర‌కే ఆయ‌న్ను క‌లుపుకుని వెళ్లిన విడదల ర‌జ‌నీ ఆ త‌ర్వాత ఆయ‌న్ను పూర్తిగా ప‌క్కన పెట్టేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో వ‌రుస‌గా సమీక్షా స‌మావేశాలు పెడుతూ అటు పాల‌నా ప‌రంగాను, ఇటు పార్టీ ప‌రంగాను ముందుకు వెళుతున్నారు. ఇక సీఎం జగన్‌ దృష్టిలో పడేందుకు ఆమె చేయని ప్రయత్నం లేదు. నవరత్నాల అమలుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. స్పందన కార్యక్రమం అమలు తీరును కూడా ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన నాయకులు తెరమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా విడదల రాజకీయం సంచలనాలకు కేంద్రంగా మారింది.

Tags:    

Similar News