బౌలింగ్ అటాక్ పై విమర్శలు వచ్చినా.. భారీగానే గెలిచాం

ఆసియా కప్-2023 టోర్నీలో భారత్ తొలి విజయం నమోదు చేసింది. వర్షం వల్ల

Update: 2023-09-05 03:20 GMT

ఆసియా కప్-2023 టోర్నీలో భారత్ తొలి విజయం నమోదు చేసింది. వర్షం వల్ల అంతరాయం కలిగిన మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో నేపాల్ పై ఘన విజయం సాధించింది. శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగిన ఈ గ్రూప్-ఏ పోరులో టాస్ గెలిచిన భారత్ నేపాల్ కు బ్యాటింగ్ అప్పగించింది. నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. మ్యాచ్ లో వర్షం పడుతూనే ఉంది. నేపాల్ ఆటగాళ్లు భారత బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.

టీమిండియా లక్ష్యఛేదనలో వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని కుదించారు. డక్ వర్త్ లూయిస్ విధానంలో భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్దేశించారు. భారత్ ఈ లక్ష్యాన్ని 20.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ దూకుడుగా ఆడారు. రోహిత్ శర్మ 59 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 74 పరుగులు చేయగా, గిల్ 62 బంతుల్లో 67 పరుగులు చేశాడు. గిల్ 8 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు.
ఈ విజయంతో భారత్ సూపర్-4 దశలోకి ప్రవేశించింది. గ్రూప్-ఏ నుంచి పాకిస్థాన్ కూడా సూపర్-4లో అడుగుపెట్టింది. గ్రూప్ దశలో భారత్, పాక్ మ్యాచ్ వర్షార్పణం అయింది. సూపర్-4 దశలో దాయాది జట్లు మరోసారి తలపడనున్నాయి. గ్రూప్-ఏలో టాపర్ గా నిలిచిన పాక్, రెండో స్థానంలో నిలిచిన భారత్ సెప్టెంబరు 10న కొలంబోలో తలపడనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. పాక్, భారత్ జట్లు నేపాల్ పై విజయం సాధించాయి. భారత్, పాక్ ఖాతాలో చెరో 3 పాయింట్లు ఉన్నాయి. రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో గ్రూప్ లో పాక్ అగ్రస్థానం దక్కించుకుంది.


Tags:    

Similar News