ఒంటెల కాపరి ఎడారి లో: కువైట్ వీసాతో సౌదీలో పనిచేయిస్తున్న అరబ్బు యజమాని

కువైట్ వీసాతో సౌదీ అరేబియాలో ఒంటెల కాపరి నాందేవ్ గిరిజనుడు ఎడారి లొకేషన్ గురించి తాజా వివరాలు. కువైట్, సౌదీ ఎంబసీల ఆపరేషన్ పై వివరాలు.

Update: 2024-08-16 16:50 GMT

ఇటీవల సెల్ఫీ వీడియోతో సంచలనం సృష్టించిన ఏడారి లోని ఒంటెల కాపరి కథ మలుపులు తిరుగుతున్నది. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రువ్వి గ్రామానికి చెందిన లంబడా గిరిజనుడు రాథోడ్ నాందేవ్ ఇంటిపని వీసాపై కువైట్ కు వెళ్లగా అక్కడి అరబ్బు యజమాని అతన్ని అక్రమంగా దేశగా సరిహద్దు దాటించి సౌదీ అరేబియా ఎడారికిలో ఒంటెల కాపరిగా పని చేయించుకుంటున్న విషయం ఇటీవల వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నాందేవ్ భార్య లక్ష్మి భారత విదేశాంగ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ ఈ విషయాన్ని  టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి తో కలిసి ఎంబసీతో సహా సంబంధిత అధికారులు దృష్టికి తీసికెళ్లారు. 

రాథోడ్ నాందేవ్ సౌదీ అరేబియా ఈస్ట్రన్ ప్రావిన్స్ లోని ఖఫ్జి పట్టణం సమీపంలోని ఎడారిలో ఉన్నట్లు తెలుస్తున్నది. నాందేవ్ వాట్సాప్ లో తన లొకేషన్ మ్యాపును అతని భార్య లక్ష్మికి షేర్ చేయడంతో ఈ విషయం రూఢి అయ్యింది. కువైట్ సిటీ కి 110 కి.మీ. దూరంలో అల్ వఫ్రా అనే పట్టణం ఉంది. అల్ వఫ్రా నుంచి 50 కి.మీ. దూరంలో సౌదీ ఆరేబియా లోని పర్షియన్ గల్ఫ్ సముద్ర తీరంలో ఖఫ్జి అనే పట్టణం ఉంది. 

కువైట్ వీసా కలిగిన భారతీయుడిని సౌదీ అరేబియా భూభాగం నుంచి రక్షించడంలో కొన్ని సాంకేతికమైన, న్యాయపరమైన చిక్కులున్నాయి. కువైట్ లోని ఇండియన్ ఎంబసీ, సౌదీ అరేబియా రాజధాని రియాద్ లోని ఇండియన్ ఎంబసీలు ఈ కేసులో సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనల మేరకు కువైట్, సౌదీ ప్రభుత్వాలను సంప్రదిస్తూ అడుగులు వేస్తున్నారు. అనుమతి లేకుండా, పొరపాటున దేశాల సరిహద్దులు దాటినప్పుడు అనుసరించాల్సిన అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపి) ను పాటిస్తూ నాందేవ్ ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఇదిలా ఉండగా టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి వాట్సాప్, ఐఎంఓ ద్వారా సౌదీ లో ఉన్న ఒంటెల కాపరి రాథోడ్ నాందేవ్ తో మాట్లాడి ఓదార్చి, ధైర్యం చెప్పిన సందర్బంగా అతని ఎడారి జీవితం ఇతర విషయాల గురించి వివరించాడు. 

ఉదయం 6 నుంచి 11 వరకు 40 ఒంటెలను ఎడారిలో తిప్పడం. తర్వాత వాటిని గ్రీన్ టెంట్ (కొట్టం) లోకి తీసుక వచ్చి నీళ్లు, మేత ఇవ్వడం. తనతో పాటు ఉన్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన రాజు అనే వ్యక్తి ఒంటెలకు దానా పెట్టడంలో సహాయం చేసి, ఒంటెల పాలు పితుకుతాడని నాందేవ్ వివరించాడు. 

తండ్రీ కొడుకులైన అరబ్బు యజమానులు పొద్దంతా తమను కనిపెట్టుకొని ఉంటారని, రెండు సార్లు జీపుతో ఢీ కొట్టారని, ఒకసారి కొట్టారని, ఆరోగ్యం బాగా లేకపోతే ఆసుపత్రికి తీసుకపోరని, తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తే చంపేసే అవకాశం ఉందని వివరించాడు. ఒంటెలు అనారోగ్యం పాలైతే మాత్రం వెంటనే వెటర్నరీ వైద్య సిబ్బందిని పిలిపిస్తారని అన్నాడు. 

తన యజమాని నెలకు రూ.20 వేల జీతం చొప్పున ప్రతి మూడు నెలలకు ఒకసారి తన కుమారుడి బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు పంపిస్తారని తెలిపాడు. డిగ్రీ పూర్తి చేసిన తన కూతురికి ఇటీవల పెళ్లి అయిందని, ఆ పెళ్లికి తాను హాజరు కాలేకపోయానని ఆవేదన చెందాడు. డిచుపల్లి లోని తెలంగాణ యూనివర్సిటీలో తన కుమారుడు ఎమ్మె చదువుతున్నాడని పిల్లల భవిష్యత్ కోసం ఎంత కష్టమైనా భరించానని నాందేవ్ చెప్పాడు.  

గత ఎనిమిది నెలలుగా ఒంటెలతో అనుబంధం ఏర్పడిందని ముఖ్యముగా పిల్ల ఒంటెలను వదిలి వెళ్లడం బాధ కలిగించే విషయం, కానీ యజమాని హింసలు, అతి వేడిని, పని ఒత్తిడిని భరించడం కష్టముగా ఉందని నాందేవ్ అన్నాడు. ఎప్పుడు ఇండియాకు చెరుకుంటానో అని రోజులు లెక్క పెడుతున్నానని అన్నాడు. 

Tags:    

Similar News