New Liquor Policy: కొత్త మద్యం పాలసీ రెడీ.. లిక్కర్ లవర్స్‌కు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులకు మరికాసేపట్లో గుడ్ న్యూస్ అందనుంది. కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది

Update: 2024-09-18 08:26 GMT

 new liquor policy in ap

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులకు మరికాసేపట్లో గుడ్ న్యూస్ అందనుంది. ఇంతకూ ఏ విధానం మంచింది? గత ప్రభుత్వ విధానంలో ఉన్న లోపాలేంటి? ప్రస్తుత ప్రభుత్వం తీసుకు వస్తున్న కొత్త ఎక్సైజ్ పాలసీతో మద్యం ప్రియులు చాలా వరకూ ఊరట కలుగుతుందా? అన్న ప్రశ్నలకు మరికాసేపట్లో సమాధానం లభించనుంది. నాణ్యమైన మద్యంతో పాటు తక్కువ ధరలకే లిక్కర్ లభిస్తుండటం ఒక రకంగా మందుబాబులకు శుభవార్త అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లుగా ఉన్న ప్రభుత్వ విధానంతో ఖజానాకు ఎంత ఆదాయం సమకూరిందో తెలియదు కాని, మద్యం సేవించే వారి ఆరోగ్యానికి మాత్రం ముప్పు ఏర్పడిందని చెప్పక తప్పదు.

జగన్ ఓటమికి...
గత ఎన్నికల్లో వైఎస్ జగన్ పార్టీ దారుణంగా ఓటమి పాలు కావడానికి మద్యం పాలసీ కూడా ఒక కారణమని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎక్కువ మంది పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రమే కాకుండా ఉన్నతస్థాయి వర్గాలలో కూడా ఎక్కువ శాతం మంది మద్యానికి అలవాటు పడిపోయారు. ఆరోగ్యానికి హానికరమైనప్పటికీ మోతాదుకు సరిపడా, నాణ్యమైన మద్యాన్ని తీసుకోవడం వల్ల తమకు ఏమీ కాదన్న ధీమాతో వారు దానికి ఎడిక్ట్‌గా మారారు. కానీ గత ప్రభుత్వం ఇది గుర్తించలేకపోయింది. మద్యనిషేధాన్ని అమలు చేస్తానని చెప్పి వైఎస్ జగన్ మద్యం ధరలను విపరీతంగా పెంచడమే కాకుండా, నాణ్యమైన బ్రాండ్లు అందించకపోవడం కూడా పార్టీ పదకొండు స్థానాలకు పరిమితం కావడానికి ప్రధాన కారణం.
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే...
ఇది ఆ పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. నాణ్యమైన మద్యాన్ని అందించకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే గత ప్రభుత్వంలో మద్యం దుకాణాలు నడిచేవి. అంతేకాదు కేవలం క్యాష్ మాత్రమే తీసుకునే వారు. ఎలాంటి డెబిట్ కార్డులు, డిజిటల్ పేమెంట్స్ ను అనుమతించకపోవడం కూడా గత ప్రభుత్వంలో వివాదానికి కారణమయింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం కూడా తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అక్రమ మద్యం పేరుతో అనేక మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. మద్య నిషేధం అమలు జరిగే సమయంలో ఎలా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని తెచ్చుకున్నారో అదే తరహాలో మద్యాన్ని తీసుకునిరావడం గత ప్రభుత్వంలో అలాాటుగా మారింది. అది కూడా జగన్ ప్రభుత్వానికి శాపంగా మారిందనే చెప్పాలి.
నూతన విధానంలో...
పేరు తెలియని మద్యం తాగి అనేకమంది అనారోగ్యం బారిన పడ్డారంటూ నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా వినియోగించుకున్నారు. తాము అధికారంలోకి వస్తే మద్యాన్ని అతి తక్కువ ధరకు, అన్ని నాణ్యమైనబ్రాండ్లను అందిస్తామని చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే కొత్త మద్యం పాలసీని అమలులోకి అక్బోబరు 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో అమలులోకి రానుంది. కొత్త విధానం ప్రకారం నాణ్యతకలిగిన అన్ని పేరున్న బ్రాండ్లు లభిస్తాయి. అంతేకాదు తక్కువ ధరలకే మద్యాన్ని విక్రయించనున్నారు. ఇక ప్రభుత్వం మద్యం దుకాణాలను నడపదు. 2019 కి ముందు తరహాలోనే వైన్ షాపులకు వేలం నిర్వహించి తద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. మద్యం ధరలపై నియంత్రణ చేస్తూనే మద్యం అలవాటును మాన్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోనుంది.


Tags:    

Similar News