స్పందన హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఆ దారుణం చేసింది అతడే

Update: 2024-10-04 13:18 GMT

అక్టోబర్ 1, 2024న తన అపార్ట్‌మెంట్‌లో స్పందన అనే 29 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ హత్య వెనుక మిస్టరీని మియాపూర్ పోలీసులు ఛేదించారు. మియాపూర్‌లోని దీప్తిశ్రీనగర్‌లోని CBR ఎస్టేట్ అపార్ట్‌మెంట్‌లో స్పందన తల్లి నమ్రత ఉపాధ్యాయురాలు, ఆమె సోదరుడితో కలిసి ఉంటోంది. విశాఖపట్టణానికి చెందిన స్పందన హైదరాబాద్‌లోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో ఉద్యోగిగా పనిచేసినప్పటికీ రెండేళ్ల క్రితం ఉద్యోగం మానేసింది.

సబ్‌ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. స్పందనకు వారణాసితో 2022లో వివాహమైంది, అయితే విభేదాల కారణంగా దంపతులు విడివిడిగా జీవిస్తున్నారు. హత్య జరిగిన రోజు నమ్రత ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లి, సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. తలుపులు తాళం వేసి ఉండటాన్ని గమనించి, స్పందనకు కాల్‌ చేసింది. తన కుమార్తె నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆందోళన చెందిన నమ్రత ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసింది. వారు తలుపులు బద్దలు కొట్టి చూడగా, లోపల స్పందన మృతదేహాన్ని ఆమె పడకగదిలో కనుగొన్నారు. స్పందన తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి.

మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు అనుమానితులను విచారించారు. సీసీటీవీ ఫుటేజీలు, ఫోన్ రికార్డుల ఆధారంగా నిందితుడిని మండల మనోజ్ కుమార్ ని పట్టుకున్నారు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో స్పందన సహోద్యోగిగా పని చేసాడని తెలుస్తోంది.
తన భర్త నుండి దూరంగా జీవిస్తున్న స్పందనపై మనోజ్ ఫీలింగ్స్ ను పెంచుకున్నాడు. స్పందన అతడి ప్రేమను తిరస్కరించిన తర్వాత, ఆమెపై పగ పెంచుకున్నాడు. హత్య జరిగిన రోజున, మనోజ్ స్పందన అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి స్క్రూడ్రైవర్, బండరాయితో దాడి చేసి అక్కడికక్కడే చంపేశాడు. మియాపూర్ పోలీసులు మనోజ్‌ను అరెస్ట్ చేసి, అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


Tags:    

Similar News