ఐఐటీ ఖరగ్ పూర్ లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణకు చెందిన విద్యార్థి కె.కిరణ్ చంద్ర తన హాస్టల్ గదిలో

Update: 2023-10-18 16:05 GMT

తెలంగాణకు చెందిన విద్యార్థి కె.కిరణ్ చంద్ర తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఐఐటీ ఖరగ్ పూర్ అధికారులు వెల్లడించారు. కిరణ్ చంద్ర ఐఐటీ ఖరగ్ పూర్ లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో డ్యుయల్ డిగ్రీ కోర్సు నాలుగో సంవత్సరం చదువుతూ ఉన్నాడు. అతను ఉరి వేసుకున్నాడని స్నేహితులు గమనించారు, అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించి అసహజ మరణంగా కేసు నమోదు చేశారు.

మంగళవారం రాత్రి 7.30 గంటల వరకు తన మరో ఇద్దరు రూమ్ మేట్స్ తో కలిసి కిరణ్ చంద్ర లాల్ బహదూర్ శాస్త్రి హాల్ ఆఫ్ రెసిడెన్స్ లోని తన గదిలోనే ఉన్నాడు. ఆ తరువాత ఆ ఇద్దరు రూమ్మేట్స్ వేరే పని పై బయటకు వెళ్లారు. అనంతరం రూమ్ లో ఒంటరిగా ఉన్న కిరణ్ చంద్ర గదికి లోపలి నుంచి గడియ వేసుకుని రూమ్ లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి 8.30 గంటల సమయంలో వేరే విద్యార్థులు తలుపు లోపలి నుంచి గడియ వేసి ఉండడం, ఎంత సేపు తలుపు తట్టినా తెరవకపోవడంతో అధికారులకు సమాచారమిచ్చారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు.
భారత్ లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత నెలలో, అనిల్ కుమార్ అనే 21 ఏళ్ల విద్యార్థి ఐఐటీ-ఢిల్లీలోని తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తులో విద్యార్థి కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడనే డిప్రెషన్ లో ఈ నిర్ణయం తీసుకున్నాడని తేలింది.


Tags:    

Similar News